బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షారుఖ్ ఖాన్. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి బాలీవుడ్ బాద్ షాగా వెలుగొందుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘పఠాన్’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ప్రస్తుతం ఆయన ‘జవాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.


సినీ రంగంలోకి అడుగు పెట్టిన షారుఖ్ పిల్లలు


కాసేపు షారుఖ్ విషయాన్ని పక్కన పెడితే ఆయన కొడుకు, కూతురు కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కూతురు సుహానా ఖాన్ బాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ‘ది ఆర్చీస్‌’ అనే సినిమాలో నటిస్తోంది.  ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ సైతం క్రియేటివ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాడు. తొలిసారి ఆయన దర్శకుడిగా ఓ యాడ్ రూపొందించారు. అయితే, ఈ యాడ్ లో షారుఖ్ ఖాన్ నటించడం విశేషం.


కొడుకు దర్శకత్వం తండ్రి యాక్టింగ్


ఆర్యన్ ఖాన్ తన మిత్రులతో కలిసి D'Yavol అనే ఓ దుస్తుల లేబుల్ ను ప్రారంభించారు. తాజాగా ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూట్ చేశారు. తన క్లాత్ బ్రాండ్ కు సంబంధించిన వీడియోను నెట్టింట్లోకి వదిలాడు. ఈ టీజర్ వీడియోలో షారుఖ్‌ను చూపించి చూపించనట్లు చూపించారు. ఆర్యన్ తన తొలి యాడ్ లో తండ్రి షారుఖ్ నటించడం స్పెషల్ గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన బ్రాండ్ D'Yavol లగ్జరీ స్ట్రీట్‌ వేర్‌ బిజినెస్‌ ను పాపులర్ చేసే పనిలో పడ్డాడు ఆర్యన్. ఆయన ప్రచారానికి షారుఖ్ తోడు కావడంతో ఓ రేంజిలో గుర్తింపు పొందడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.  






వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్న ఆర్యన్


అటు ఆర్యన్ ఓ వెబ్ సిరీస్ రూపొందించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. తన దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉటుంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్, నటీనటులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   






అటు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో షారుఖ్ సరసన అందాల తార నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి కావొచ్చింది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.  షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.  అటు సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో ‘డుంకీ’ అనే మరో సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె, తాప్సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Read Also: షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ వీడియో క్లిప్స్ లీక్, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!