'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు అనుదీప్. రీసెంట్ గా ఇతడు డైరెక్ట్ చేసిన 'ప్రిన్స్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ వెర్షన్ కంటే తెలుగులో బాగా ఆడుతుందని హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. 

 

కామెడీ ఉన్నప్పటికీ.. జనాలకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. తమిళంలో ఈ సినిమాకి కనీసపు కలెక్షన్స్ కూడా లేవట. ఈ సినిమా వర్కవుట్ అవ్వనప్పటికీ.. అనుదీప్ చేతిలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నట్లు చెప్పారు అనుదీప్. 

 

Anudeep to direct Venkatesh, Ram Pothineni: హారిక హాసిని సినిమా వెంకటేష్ గారితో అనుకుంటున్నామని.. ఇంకా కథ ఓకే అవ్వలేదని చెప్పారు. అలానే హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలని అన్నారు. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్ లు. ఈ బ్యానర్స్ లో సినిమాలు పడి.. క్లిక్ అయితే గనుక అనుదీప్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం గ్యారెంటీ. మరేం జరుగుతుందో చూడాలి. 

 

ప్రస్తుతం వెంకటేష్, రామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'ఎఫ్ 3' సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సందడి చేశారు. ఆ తర్వాత ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. వెంకీతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి తేజ వరకు చాలా మంది కథలు చెప్పారు. కానీ, ఏదీ ఓకే కాలేదు. వేరే సినిమాలతో ఆయన దర్శకులు బిజీ బిజీ అవుతున్నారు. హిందీలో హిట్ అయిన 'దే దే ప్యార్ దే' రీమేక్ రైట్స్ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. బహుశా... ఆ రీమేక్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు.

 

ఇక రామ్ విషయానికొస్తే.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్ లో యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ ను సాధించాయి. ఆ విధంగా బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తొలిసారి ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి!