బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ 'బద్రి', 'నాని' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించినప్పటికీ తెలుగులో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ లోనే నటిస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అవకాశాలు తగ్గినప్పటికీ.. ఫొటోషూట్లు, ఈవెంట్స్ తో కాలం గడుపుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమెపై చీటింగ్ కేసు నమోదైంది.


 పోలీసులకు అందించిన ఫిర్యాదులో వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆమె రూ.4 లక్షలు ఛార్జ్ చేసింది. అయితే ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి ఆ తరువాత వెళ్లిపోయింది. దీంతో అమీషా పటేల్ మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ విషయంపై అమీషా పటేల్ స్వయంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. 'ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. ఆ ఈవెంట్ ను స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అరవింద్‌ పాండే చాలా చెత్తగా నిర్వహించారు. నాకు ప్రాణభయం పట్టుకుంది. కానీ స్థానిక పోలీసులు నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు' అని పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ 'గడర్ 2' సినిమాలో నటిస్తోంది. 


Also Read: తెరవెనుక 'థాంక్యూ' టీమ్ - ఏం డిస్కస్ చేసుకుంటున్నారో?


Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే