స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో విడుదల కానుంది. రీసెంట్ గా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఫస్ట్ పార్ట్ ను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో సినిమాలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలనుకుంది. 


'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో చాలా హడావిడి చేసింది. సాంగ్ ప్రోమో కూడా వదిలింది. ఆగస్టు 13న ఫుల్ సాంగ్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే పాట లీక్ అయింది. నిజానికి ఈ పాటను ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ తో పాడించారు. తెలుగులో సింగర్ శివమ్ ఈ పాట పాడారు. కానీ లీకైన వెర్షన్ లో మాత్రం దేవిశ్రీప్రసాద్ గొంతు వినిపించింది. దాదాపు రెండు నిమిషాల పాట బయటకు వచ్చేసింది. 


Also Read : Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..


వెంటనే అలెర్ట్ అయిన చిత్రబృందం యూట్యూబ్ లో లీకైన పాటను డిలీట్ చేయించే పనిలో పడింది. కానీ అప్పటికే వాట్సాప్ లో పాటను అందరూ ఫార్వార్డ్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట చక్కర్లు కొడుతోంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం కావాలనే ఈ పాటను లీక్ చేశారని.. హైప్ తెచ్చుకోవడానికి ఇలా చేశారంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక రెండో పార్ట్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.