బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఓ పక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఈమె ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. రీసెంట్ గా ఈమె నటించిన 'డార్లింగ్స్' అనే సినిమా ఓటీటీలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక త్వరలోనే 'బ్రహ్మాస్త్ర' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది అలియాభట్. ఈ సినిమాలో ఆమె భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటించింది. 


సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది అలియా. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలియాభట్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. కరణ్ జోహార్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 


ఈ సినిమాలో నటించే సమయానికి అలియాభట్ వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన తొలి రెమ్యునరేషన్ గురించి వివరించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకి తనకు కేవలం రూ.15 లక్షలు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. దానికి సంబంధించిన చెక్ ను నేరుగా తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టిందట అలియా. తన రెమ్యునరేషన్స్ కి సంబంధించిన విషయాలన్నీ అమ్మనే చూసుకోమని చెప్పినట్లు.. అప్పటినుంచి ఇప్పటివరకు అమ్మే వాటి గురించి చూసుకుంటుందని తెలిపింది. 


ఈ సంగతి పక్కన పెడితే.. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించిన రణబీర్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకుంది అలియా. ప్రస్తుతం ఈమె గర్భవతి. తొలిసారి తన భర్తతో కలిసి 'బ్రహ్మాస్త్ర'లో నటించింది అలియా. దీంతో ఈ సినిమాపై బజ్ పెరిగింది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇది. తెలుగు ట్రైలర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో దర్శకధీరుడు రాజమౌళి భాగస్వామిగా ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. 


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!