'మేజర్'.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. 


జూన్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పూర్తి ఎమోషన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మిలిటరీలోకి వెళ్లిన ఉన్నికృష్ణన్ ఆ దేశం కోసం ప్రాణాలు వదులుతాడు. ట్రైలర్ మొత్తం ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో ఓ రేంజ్ లో ఉంది. 


ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లితో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.