డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.. కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆయన హీరోగా పరిచయం అయి అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 


2002 జూలై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ 'ఈశ్వర్' అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ పై అయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగమని దీవించారు. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయన కూడా ఊహించలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడమనేది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది. 


కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ల వాళ్ల సొంత టాలెంట్ పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అయన నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే 'ఆదిపురుష్' సినిమాను అటు హాలీవుడ్ లోకూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.


ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికి 20 ఏళ్లు పూర్తవడంతో ఆయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు 'ఈశ్వర్' సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు.  


ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్లు గడచిపోయాయా అనే సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమే అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలని అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. 'ఈశ్వర్' కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం . ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్ గా నటించాడంటే అయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.  


Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!


Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్