'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు జానీ డెప్. హాలీవుడ్ లో ఆయన కెరీర్ దూసుకుపోతున్న సమయంలో అతడి భార్య అంబర్ హెరాల్డ్ తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం జరిగాయి. ఆ తరువాత అంబర్, జానీ డెప్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కారు. ఈ కేసులో ఫైనల్ గా జానీ డెప్ విజయం సాధించారు. 


జానీ తనను టార్చర్ చేశాడని, కొట్టేవాడని అంబర్ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్ లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమాలు చేయడానికి నిరాకరించాయి. ఇప్పుడు అతడికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో తిరిగి అతడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే దానికంటే ముందు డిస్నీ జానీ డెప్ ను క్షమాపణ కోరుతూ లెటర్ పంపించినట్లు తెలుస్తోంది. 


అంతేకాదు.. కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. డాలర్స్ లో చూసుకుంటే 301 మిలియన్. మరి జానీ వారిని క్షమించి, తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ఫ్రాంచైజీలో నటిస్తారా..? లేదా..? అనేది తెలియాల్సివుంది. 


2015లో జానీ డెప్, అంబర్ ల వివాహం జరిగింది. కానీ.. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ కోర్టులో కేసులు పెట్టుకున్నారు. అంబర్ రాసిన సెక్సువల్ వయిలెన్స్ ఆర్టికల్ తన పరువుకి భంగం కలిగించే విధంగా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో ఆమెపై కేసు పెట్టారు జానీ డెప్. అంబర్ నుంచి 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుని కోరారు జానీ. దీనికి కౌంటర్ గా తాను గృహ హింసను ఎదుర్కొన్నానంటూ 100 మిలియన్ డాలర్లకు దావా వేసింది అంబర్. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు జానీకి ఫేవర్ గా తీర్పునిచ్చింది.