గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ స్కీమ్ను అమలు చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రకటించారు. ఇందులో భాగంగా పేదలకు ప్రతినెల రూ.6 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడతాయన్నారు.
గోవాలో మేం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంటున్నాం. సరికొత్త న్యాయ్ పథకాన్ని అమలు చేయనున్నాం. ఇందులో భాగంగా పేదలకు ప్రతినెలా రూ. 6 వేలు అంటే ఏడాదికి రూ. 72 వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
భాజపాపై విమర్శలు..
ఈ సందర్భంగా భాజపాపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పర్యటక రంగం, కొవిడ్ 19, ఉద్యోగాలు కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.
మా పార్టీ దోపిడీదారులకు టికెట్లు ఇవ్వలేదు. ఈసారి రాజకీయాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చాం. ఈసారి పోటీ కాంగ్రెస్, భాజపా మధ్యే. కనుక ఇతురులకు వేసి మీ ఓట్లు వృథా చేసుకోండి. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ పనాజీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, పర్యటక రంగం ప్రతినిథులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.