ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ఏబీపీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజా సమస్యల పట్ల అవగాహన కూడా లేదన్నారు. తన పోరాటం ఉద్యోగాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమన్నారు. ఓటు అనే ఆయుధం ముందు యోగి 'బుల్డోజర్' ఎందుకు పనికిరాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.






ప్ర: ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? 


ప్రియాంక: తమ అభివృద్ధి కోసం,సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఓటేయాలని కాంగ్రెస్ ముందు నుంచి చెబుతోంది. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి,వాటిని నాయకులు పరిష్కరించాలి,అలాంటి నాయకుల్నే ఎన్నుకోవాలి. రాజకీయాల్లో కావాల్సింది ఇది.మేం చెప్పేది ఇదే.. ప్రజలు ఇది వింటారు అనుకుంటున్నాను.


ప్ర: యూపీ ఎన్నికల్లో ఒకరు బుల్డోజర్ అంటున్నారు, మరొకరు రాష్ట్రాన్ని సిమ్లా చేస్తామంటున్నారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు.. మీరేం చెప్తారు? 


ప్రియాంక: వీటితో ప్రజలకు ఏంటి సంబంధం. ప్రజలకు కావాల్సింది.. ఉద్యోగాలు, చదువు,అభివృద్ధి. రైతుల సమస్యలే చాలా ఉన్నాయి. వాటిపై ఎందుకు చర్చ జరగడం లేదు. ఇలాంటి అక్కర్లేని మాటలతో ప్రజల కడుపులు నిండుతాయా? వీటి వల్ల రాజకీయ నేతలకు లాభం తప్ప.. ప్రజలకు కాదు. ఇలాంటివి ఇప్పటికైనా ఆగాలి. రాజకీయ పార్టీలకు,నేతలకు ఇదే నా విజ్ఞప్తి. ప్రజా సమస్యలపై మాట్లాడండి.


ప్ర: రాజకీయాలు, ఎన్నికల్లో వాగ్దానాల గురించి పక్కన పెడితే.. అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీరు యూపీ అంతా తిరిగారు కదా.. వాళ్లకు కావాల్సిందేంటి? 


ప్రియాంక: ఉత్తర్‌ప్రదేశ్‌లో నేను అన్ని వర్గాల ప్రజల్ని కలిశాను. రైతుల దగ్గరికి వెళ్లే మద్దతు ధర, అధిక కరెంట్ బిల్లులు ఇలా వాళ్లకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు లేవు. మహిళలకు ఆర్థిక చేయూత లేదు.ఈ ఐదేళ్లలో మరి ప్రభుత్వం ఏం చేసింది.అందుకే వీటి గురించి మాట్లాడుతుంటే ప్రజలు వింటున్నారు. మేం సరిగ్గా మాట్లాడుతున్నామని చెబుతున్నారు.


ప్ర: మీరు పోరాటం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి.. లఖింపుర్ ఘటన కావొచ్చు మరేదైనా సమస్య కావొచ్చు.. 'నేను మహిళను.. నేను పోరాడతాను' (మే లడికీ హూ.. మే లడ్ సక్తిహూ) అనే నినాదం ఇస్తున్నారు.. ఇది ఎలా వచ్చింది? 


ప్రియాంక: నేను యూపీ సమస్యలపై పోరాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో మంది అత్యాచార బాధితులను కలిశాను, వారి కుటుంబాలతో మాట్లాడాను. వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. ప్రతి కేసులోను జరిగింది ఒకటే. అమ్మాయిపై అత్యాచారం జరుగుతుంది, అధికారులు, పోలీసులు నిందితుడి వైపు నిలబడుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా కాపాడుతున్నారు. 


అంతేకాకుండా అత్యాచార బాధితురాలిని హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ల కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. వాళ్లను మాట్లాడకుండా బెదిరిస్తున్నారు. ఉన్నావ్ సహా ప్రతి ఘటనలోను మహిళలు పోరాటపటిమ చూపించారు. ఇది నేను చూశాను. అందుకే (మే లడికీ హూ.. మే లడ్ సక్తిహూ) అనే నినాదం చేశాను.


ప్ర: మీరు యూపీలో పోరాటం చేయడానికి వచ్చేసరికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఉంది. అలాంటి సమయంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టడం కష్టంగా అనిపించలేదా? 


ప్రియాంక: అవును.. నేను ఈ బాధ్యతలు చేపట్టేసరికి పార్టీ కష్టాల్లో ఉంది. పోరాటం చేయాలి. అదే చేస్తున్నాను. అలా కాదని అంతా వదిలేసి పారిపోవడం వల్ల లాభమేంటి. పోరాడాలి.. అదే బాధ్యత. 


ప్ర: మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు వస్తుంటారు. ఫొటోలు దిగుతుంటారు, మీపై చాలా అభిమానం చూపుతారు. మీకు ప్రజాకర్షణ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దాన్ని ఓట్ల రూపంలోకి ఎందుకు మార్చలేకపోతున్నారు?


ప్రియాంక: ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కానీ మూడేళ్లలో పార్టీలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలు, నేతలు ప్రజలను కలుపుకొని ఐకమత్యంగా పోరాటం చేస్తున్నారు.


కానీ సమాజ్‌వాదీ పార్టీ, భాజపా కార్యకర్తలు, నేతలు ఈ మూడేళ్లలో ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి బయటకు వచ్చారా? కరోనా సంక్షోభం సహా ఎన్నో ఘటనల్లో ప్రజలకు సాయం చేయడంలో కాంగ్రెస్ ముందుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే కనబడతారు.


ప్ర: ప్రియాంక గాంధీ.. మీ పోరాటం భాజపాపైనా, సమాజ్‌వాదీపైనా లేక బీఎస్పీపైనా?


ప్రియాంక: నా పోరాటం ఉద్యోగాల కోసం, పేదల కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం..మాత్రమే.. రాజకీయ నేతలపై కాదు.


ప్ర: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్  భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌ది కుటుంబ రాజకీయాలు అనే ఆరోపణలు చేస్తున్నారు? దానిపై మీరేమంటారు? 


ప్రియాంక: ప్రధాని మోదీకి కుటుంబ రాజకీయాలు నచ్చకపోతే.. మరి అదే కాంగ్రెస్‌ కుటుంబపాలనలో ఎన్నో ఏళ్లు పనిచేసినా నేతలను భాజపాలోకి ఎందుకు తీసుకున్నారు. ఆయన సమస్య కుటుంబ రాజకీయాల గురించి కాదు. అలా అయితే ఆయన పార్టీలో కూడా కుటుంబ రాజకీయాలు ఉన్నాయి.


భాజపా ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను డబ్బులిచ్చి కొనేసి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారి పార్టీని అధికారంలోకి తెస్తున్నారు. ఇది తప్పు కాదా? దీన్ని కూడా చాలామంది ఎదో గొప్ప ఘనతలా టీవీల్లో చూపిస్తున్నారు. భాజపా మాస్టార్ స్ట్రోక్ అని హెడ్ లైన్స్ పెడుతున్నారు.ఇలా చేయడం తప్పు కదా.


ప్ర: మీకు అప్పడప్పుడు చాలా ఆగ్రహం, కోపం వస్తుంటాయి కదా? లఖింపుర్ ఘటన జరిగినప్పుడు ఇలా చాలా సార్లు చూశాం. మీకు ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది? 


ప్రియాంక: అన్యాయాన్ని చూసినప్పుడు వస్తుంది. ప్రజా సమస్యలను చూసినప్పుడు వస్తుంది. ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం పనిచేయకపోతే కోపం వస్తుంది.


ప్ర: యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా 'బుల్డోజర్' గురించి చెబుతున్నారు? ఇప్పుడు రిపేర్‌కు ఇచ్చాం, మార్చి 10 తర్వాత బయటకు తీసుకువస్తాం అంటున్నారు? దీనిపై ఏమంటారు?


ప్రియాంక: ఏంటి ఈ బెదిరింపులు, ఎవర్ని బెదిరిస్తున్నారు? ప్రజలపైనా మీ బెదిరింపులు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల శక్తి మీకు తెలియదు. ఒక్క ఓటుతో మిమ్మల్ని అధికారం నుంచి కిందకి తోసేయగలరు.. ముందు ఇది తెలుసుకోమనండి.


ప్ర: ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరు పోరాటం చేయడానికి వచ్చారు.. మరి భవిష్యత్తులో ప్రియాంక ఏం చేస్తారు? ఉత్తర్‌ప్రదేశ్‌ను వదిలి వెళ్తారా? 


ప్రియాంక: ఉత్తర్‌ప్రదేశ్‌ను వదిలి వెళ్లే సమస్యే లేదు. కచ్చితంగా లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌ కార్యకర్తలు, ప్రజల కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటాను. వదిలి పారిపోయే రకం కాదు.