Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు వచ్చాయి. పార్టీకి పెద్ద అసెట్ అనుకున్న వారంతా ఓటమి పాలయ్యారు. గెలుస్తారో లేదో అనే అనుమానం ఉన్న వాళ్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కమల దళానికి 8 స్థానాలు ప్రజలకు కట్టబెట్టిన కీలకమైన నేతలు ఓడిపోవడం మాత్రం మింగుడుపడని అంశం. 


బండి సంజయ్‌ ఓటమి జీర్ణించుకోలేని విషయం 
బండి సంజయ్‌ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి నేత. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో పార్టీని స్పీడ్‌గా వృద్ధిలోకి తీసుకొచ్చారు. వివాదాస్పద కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే బండి... బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన్ని అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ డీలా పడిపోయింది. కేంద్ర కమిటీలో బండి తీసుకున్నారు. సీఎంగా బీసీ నేతలను నియమిస్తామన్న బీజేపీ అగ్రనాయకుల నిర్ణయించారు. ఆ టైంలో బండిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అలాంటి వ్యక్తి ఓడిపోవడం పార్టీకి చాలా మైనస్‌గానే చెప్పవచ్చు. 


బండి సంజయ్‌ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని ఆయన భావించారు. కానీ అది వర్కౌట్ కాలేదని స్పష్టం అవుతుంది. ఈసారి కూడా అసెంబ్లీలో అధ్యక్షా అందామని అనుకున్న బండి సంజయ్ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. ముచ్చటగా మూడోసారి ఓటమిపాలయ్యారు. 


రఘునందన్‌రావుకు తప్పని ఓటమి 
2020 ఉపఎన్నికల వరకు రఘునందన్‌ రావు అంటే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసు. కానీ ఉపఎన్నికల్లో విజయంతో ఒక్కసారిగా హీరో అయిపోయారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో బీజేపీ తరఫున రఘనందన్‌రావు పోటీ చేశారు. బీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాతకు అవకాశం దక్కింది. ఆమెను రఘునందన్‌రావు 1079 ఓట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. అధికార పార్టీకి పెద్ద దెబ్బగా భావించారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్‌రావు ఓడిపోయారు. ఇది బీజేపీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు. 


అర్వింద్‌కు ఎదురు దెబ్బ 
నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఈసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ తెలంగాణ లీడర్లలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తరచూ కవితపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రచార సమయంలో కూడా కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తి ఓటమి కూడా పార్టీకి ఎదురు దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఈటల రాజేందర్‌కు కోలుకోలేని దెబ్బ 
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఓటమి బీజేపీకి అతి పెద్ద దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమనేతగా ఉంటూ బీఆర్‌ఎస్‌లో టాప్ లీడర్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా పార్టీ మారడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఆయన్ని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ మారారు. బీజేపీలో చేరిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అక్కడ 2021లో ఉపఎన్నికలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేశారు. ప్రతిష్టాత్మకంగా ఈ ఉపఎన్నికను తీసుకున్న బీఆర్‌ఎస్‌ ఈటలకు ప్రత్యర్థిగా గెల్లుశ్రీనివాస్‌ను పెట్టింది. దళిత బంధులాంటి పథకాన్ని ప్రవేశ పెట్టి మంత్రులు, బీఆర్‌ఎస్‌ లీడర్లంతా ఇక్కడ ప్రచారం చేశారు. అష్టదిగ్బంధం చేసినా ఈటల భారీ విజయాన్ని నమోదు చేసి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. 


అలాంటి ఈటల రాజేందర్‌ 2023 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయన కేసీఆర్‌ను కూడా ఢీ కొట్టారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేశారు. హుజూరాబాద్‌లో కూడా పోటీకి దిగారు. ఇక్కడ ఆయనపై మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌ రెడ్డి పోటీ చేశారు. ఈయన హుజూరాబాద్‌ ఉపఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ డిపాజిట్లు కూడా రాలేదు. తర్వాత బీఆర్‌ఎస్‌లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఈటల రాజేందర్‌ ను ఢీ కొట్టారు. విజయం సాధించారు. 


ప్రచారం సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాను ఈసారి విజయం సాధించకపోయే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకొచ్చారు. మూడో తేదీ తర్వాత గెలిస్తే విజయయాత్రలో పాల్గొంటానని... లేకుంటే తన శవయాత్రకు అంతా రావాలంటూ ఎమోషనల్‌గా ప్రచారం చేశారు. ఇదే ఆయన విజయానికి ఈటలకు ఓటమికి కారణమని స్థానికులు అంటున్నారు.