తెలంగాణను ప్రగతిపథంలో దూసుకెళ్లేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఏఎన్‌ఐతో ప్రత్యేకంగా మాట్లాడిన కవిత... ఈ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజలు ఆమోదం తెలుపుతారని అభిప్రాయపడ్డారు. సంపద సృష్టిస్తూ దాన్ని ప్రజలకు పంచడంలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు కవిత. 2014తో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3 లక్షల 15 వేలకు చేరిందన్నారు. 


అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలను సరి చూసుకొని సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని హామీలు ఇస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇందులో ఆర్థిక క్రమశిక్షణ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కలిసి ఉంటాయన్నారు. కానీ ప్రజలను మోసం చేయాలని గెలిస్తే చాలాన్న  ఉద్దేశంతో ప్రతిపక్షాలు నోటికు వచ్చిన హామీలు గుప్పిస్తాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. 


బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్‌, బీజేపీకి మైండ్ బ్లాంక్‌ అయిందని ఎద్దేవా చేశారు కవిత. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలో టిష్యూ పేపర్లని ఆరోపించారు. గ్యారెంటీ లేని హామీలతో ప్రజలను మభ్యపెట్టలేరని అభిప్రాయపడ్డారు. అలాంటి గ్యారెంటీలు పట్టుకొని ప్రమాణాలు చేయడానికి రమ్మని సవాల్ చేయడం హాస్యాస్పదమన్నారు.


ఇలాంటి గొప్ప హామీలు బీఆర్‌ఎస్‌ ఇస్తుందని కాంగ్రెస్ ఊహించలేదని అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కవిత. అసలు చిత్తుకాగితం ఎవరిదో ప్రజలు తేలుస్తారని అభిప్రాయపడ్డారు. ఇప్పటకే నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చారని అక్కడ వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తేస్తున్న వార్తలను నిత్యం వింటున్నామన్నారు. 


కాంగ్రెస్ చేస్తున్న తప్పులను వదిలేసి అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణాలు చేద్దామని పిలువడం ఎంత వరకు కరెక్టని కవిత ప్రశ్నించారు. అసలు రేవంత్‌కు ఆ స్థాయి లేదని విమర్శించారు. తెలంగాణలో అమరవీరుల మరణాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీశారు. అమరులపై అంత ప్రేమ ఉంటే రాహుల్‌ గాంధీతో స్తూపం వద్ద ప్రమాణం చేయించాలని సవాల్ చేశారు. అప్పుడైనా కాంగ్రెస్ చేసిన పాపాలు కొంతైనా పోతాయని అభిప్రాయపడ్డారు. 


అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను బీజేపీ బీట్‌అవుట్ చేసిందన్నారు కవిత. 2014లో ఇచ్చిన హామీలనే ఇంత వరకు బీజేపీ అమలు చేయాలదని విమర్శించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తాం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్లు వాటి సంగతే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలో మాత్రం తాము చెప్పిన హామీలను 99 శాతానికిపైగా అమలు చేశామన్నారు కవిత. రెండు లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేటు రంగంలో 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 


విభజన చట్టంలో పెట్టిన వాటిని కూడా అమలు చేయలేకపోయారని బీజేపీపై విరుచుకుపడ్డారు కవిత. వాటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు రావడం లేదన్నానారు. 2018 ఎన్నికల్లో 105 స్థానాలాల్లో డిపాజిట్లు పోతే... ఈసారి 119 స్థానాల్లో డిపాజ్లు గల్లంతు అవుతాయని ఎద్దేవా చేశారు.