తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని శ్రీనివాస్ గౌడ్‌పై పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో రాఘవేందర్ రాజు  అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. రాఘవేందర్ రాజు పిటిషన్‌కు సమాధానం చెప్పాలని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో రాఘవేందర్ రాజు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాఘవేందర్ రాజు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...ప్రతివాది శ్రీనివాస్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది. 


మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ గౌడ్ కేసులో తమపైనా కేసుల నమోదుకు కోర్టు ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ బద్ద వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసంది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 


మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో హైకోర్టు‌లో పిటిషన్‌ వేశారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు పూర్తిగా ప్రకటించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో తెలిపారు. అయితే రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. 


ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం సమర్పించారని కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు చేసింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 వనమా కాంగ్రెస్ ఎంఎల్‌ఎగా గెలిచి అనంతరం బిఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల సమయంలో వనమా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని. 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేశారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని హైకోర్టు ఎంఎల్‌ఎగా ప్రకటించింది. దీనిపై ఎంఎల్‌ఎ వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వనమా వెంకటేశ్వరరావు ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా? లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా? తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది