Hyderabad Lok Sabha Elections 2024: హైదరాబాద్ లోక్ సభ సభ్యుడిగా ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఈయన ఈ స్థానం నుంచి గెలవడం వరుసగా ఇది ఐదోసారి. ఈసారి ఏకంగా సుమారు 3 లక్షల 38 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి మాధవి లతపై విజయం సాధించారు. 


అసదుద్దీన్ ఒవైసీకి 6,58,811 ఓట్లు రాగా.. మాధవీ లతకు 3,20,476 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీఉల్లాహ్ సమీర్ మూడో స్థానంలో 62,478 ఓట్లతో సరిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు కేవలం 18,491 ఓట్లు మాత్రమే వచ్చాయి. 


హైదరాబాద్‌ లోక్ సభ నియోజకవర్గంలో కొన్నాళ్లుగా హడావుడి చేసిన బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లతకు నిరాశే ఎదురైంది. ఇక్కడ ఎప్పటిలాగే ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి అసదుద్దీన్ ఒవైసీ 44,768 ఓట్ల మెజారిటీతో కొనసాగారు. ఒవైసీకి ఈ సమయానికి 1,93,028 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మాధవీ లతకు 1,48,260 ఓట్లు మాత్రమే రాగా.. రెండో స్థానంలో కొనసాగుతున్నారు.


హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అయింది. ఈ లోక్ సభ పరిధిలో మొత్తం ఆరుచోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఉండగా.. 15 రౌండ్లలో చార్మినార్‌ సెగ్మెంట్‌ కౌంటింగ్ పూర్తికానుంది. ఆఖరున యాకుత్‌పురా కౌంటింగ్ పూర్తికానుంది. మొత్తం-1944 కేంద్రాలల్లో 142 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది.


మలక్‌పేట-300 పోలింగ్‌ కేంద్రాలు -22 రౌండ్లు


కార్వాన్‌-311 పోలింగ్‌ కేంద్రాలు-23 రౌండ్లు


గోషామహల్‌-235 పోలింగ్‌ కేంద్రాలు-17 రౌండ్లు


చార్మినార్‌-198 పోలింగ్‌ కేంద్రాలు 15-రౌండ్లు


చాంద్రాయణగుట్ట-305 పోలింగ్‌ కేంద్రాలు 22-రౌండ్లు


యాకుత్‌పురా -332-పోలింగ్‌ కేంద్రాలు 24-రౌండ్లు


బహదూర్‌పురా-263 పోలింగ్‌ కేంద్రాలు- 19-రౌండ్లు