Candidates Elections Expences :  ఇప్పుడంతా ఎన్నికల సీజన్. అభ్యర్థులంతా ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి రూపాయి ఖర్చుకు అభ్యర్థులు లెక్కలు చూపాలి. దీన్ని తేలిగ్గా తీసుకుంటే గెలిచినా, తర్వాత పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చూ రోజువారీ పద్దుల పుస్తకంలో నమోదు తప్పనిసరి. అభ్యర్థుల పేరుతో బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాల్సి ఉంటుంది.   సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ర్యాలీలు, ఇతరాల ప్రతి ఖర్చుకూ లెక్కలు చూపక తప్పదు. 


అభ్యర్థుల ఖర్చుపై  పరిమితి 


లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. దీనికి లోబడే ఖర్చు ఉండాలి. దేనికి ఎంత అనేది కూడా ఈసీ నిర్ణయించింది. సామర్థ్యం ప్రామాణికంగా రూ.1,200 నుంచి రూ.ఐదు లక్షల వరకు సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. చదరపు అడుగు ఎల్‌ఇడి వాల్స్‌కు రూ.342 వరకు అనుమతిస్తారు. కళ్యాణ మండపానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, టన్ను ఎసికి రూ.4 వేలు, ఎయిర్‌ కూలర్లకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించవచ్చు. ఎన్నికల ప్రచారమన్నాక బ్యానర్లు, బ్యాడ్జీలు, జెండాలు, పోస్టర్లు, అనుచరులకు అల్పాహారాలు, భోజనాలు, తప్పవు. వీటిలో ప్రతి అంశమూ వ్యయ పరిమితికి లోబడే ఉండాలి. పార్టీ గుర్తు ఉన్న ప్రతి వస్తువుకూ నిర్ణీత ధర ప్రకారమే పద్దు రాయాలి. సాధారణ కుర్చీకి రూ.5 నుంచి రూ.20, స్టీలు కుర్చీకి రూ.100, మహారాజా సోఫాకు రూ.1,500, షామియానాలకు రూ.800 నుంచి రూ.10 వేలు, మినీ జనరేటర్‌కు రూ.3,500, 125 కెవి జనరేటర్‌కు రూ.20 వేలకు మించకూడదు. 200 గ్రాముల పులిహోర, ప్లేట్‌ ఉప్మా , దోశలకు రూ.30 ధరలు ఖరారు చేశారు. 


రాజకీయ కూలీల ఖర్చు కూడా ఖాతాలో రాయాల్సిందే !


ప్రచారంలో నిర్వహించే ర్యాలీల్లో ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు కూలీలు పాల్గొంటారు. వీరు సభా ప్రాంగణాల ఏర్పాటుకే పరిమితం కారు. వందల సంఖ్యలో జనసమీకరణ జరగాలంటే అందుకు కొంత వ్యయం భరించాల్సిందే. ఈ ఖర్చును వారి కూలిగా చూపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. బైక్‌కు ఐదు లీటర్ల పెట్రోల్‌కు రూ.550, ఎద్దుల బండికి రూ.1,500, నైపుణ్యం లేని కార్మికులకు రూ.519 నుంచి రూ.649 వరకు, మోస్తరు నైపుణ్యమున్న వారికి రూ.621 నుంచి రూ.776 వరకు, నిపుణులకు రూ.741 నుంచి రూ.926, అతి నైపుణ్యమున్న వారికి రూ.1,046 నుంచి రూ.1,059 వరకు చెల్లించాలని  ఈసీ  సూచించింది.  


ఇప్పుడు ఖర్చు లెక్కలోకి రాదు.. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే !                      


ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఎన్నికల సంఘం లెక్కలు వేయదు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అంటే... నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండే ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున సహాయ వ్యయ పరిశీలకులను, పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి అన్ని విభాగాలను పరిశీలించేందుకు మరో ఎనిమిది మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది.