Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫలితాల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.


ఉదయం నుంచే


ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది.


పంజాబ్‌లో ఆప్


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి  ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని ABP-C voter సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ABP-C voter నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది.


మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28  సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


గోవాలో హంగ్


గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్‌ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఆప్‌ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.  


ఉత్తరాఖండ్


ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చు. ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

 

మణిపుర్

 

ఈ ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం మణిపుర్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని తేలింది. భాజపాకి 23 నుంచి 27 స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ప్రజలు నిలబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.