రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి (Ys Jagan)వైనాట్ 175 అంటూ ప్రతిన బూనారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి ఒక్కటంటే ఒక్కసీటు రాకుండా చేసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం( TDP) కంచుకోట సీట్లు, ముఖ్యనేతలు బరిలో దిగే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలోని కీలక నేతలకు అక్కడి బాధ్యతలు అప్పగించి నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సీట్లలో పాగా వేసేందుకు సామ, దాన ,దండోపాయలన్నీ వినియోగిస్తున్నారు.
కుప్పంపై కన్నేశారు


మిగిలిన నియోజకవర్గ్గాల సంగతి ఎలా ఉన్నా... ముఖ్యంగా మూడు సీట్లపై సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ( Chandra Babu)పోటీ చేసే కుప్పంతోపాటు ఆయన కుమారుడు బరిలో ఉండే మంగళగిరి (Mangalagiri), బావమరిది బాలకృష్ణ ( Bala Krishna) నియోజకవర్గం హిందూపురం. 


ఈ మూడు నియోజకవర్గాల బాధ్యతలను పార్టీలోని ఇద్దరి కీలక నేతలకు అప్పగించారు. ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేయనున్న కుప్పానికి ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddi Rama Chandra Reddy)కి బాధ్యతలు అప్పగించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సొంత నియోజకవర్గం కన్నా కుప్పంపైనే పెద్దిరెడ్డి ఎక్కువ దృష్టి సారించారు. 


స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలను కనీసం నామినేషన్లు వేయనీయకుండ అడ్డుకున్నారు. వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీలు సహా పంచాయతీలు, జెడ్పీటీసులను వైసీపీ పెద్దసంఖ్యలో కైవసం చేసుకుంది. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారంటే... వైసీపీ(YCP) ఈసీటుపై ఎంత ముందస్తుగా దృష్టిసారించిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ లేనంతంగా చంద్రబాబు సైతం పదేపదే కుప్పంలో పర్యటించి శ్రేణులకు భరోసా ఇవ్వాల్సి వస్తోంది.


మంగళగిరిలో మరోసారి....
తెలుగుదేశం కీలక నేత నారా లోకేశ్ పోటీ చేయనున్న మంగళగిరి(Mangalagiri)లో మరోసారి పాగా వేయాలని సీఎం జగన్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసే చేనేత కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాది ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సామాజికవర్గంలో ఉన్న కీలక నేత గంజి చిరంజీవిని తెలుగుదేశం( TDP) పార్టీ నుంచి వైసీపీలోకి లాగేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. పార్టీలో నెంబర్‌ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి మంగళగిరిలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. 


లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉండటంతో ... వైసీపీ లీడర్లు ఇక్కడ పనులు మెల్లగా చక్కబెడుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన యువనేత తక్షమే అప్రమత్తయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు..


హిందూపురంలో మహిళా కార్డు
తెలుగుదేశం కంచుకోట హిందూపురం(Hindhupuram) బద్దలు కొట్టేందుకు వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేయింబవళ్లు అక్కడే మకాం వేస్తున్నారు. కొత్త సమన్వయకర్తగా దీపికా రెడ్డిని తీసుకొచ్చారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను లోక్‌సభ అభ్యర్థినిగా బరిలో దింపుతున్నారు. 


నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అసమ్మతివర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి కుటుంబానికి అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి మహిళా కార్డు చూపి మగువుల ఓట్లు కొల్లగొట్టేందుకు పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చలను కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేశారు. తెలుగుదేశంలోని అసమ్మతి వర్గాన్ని సైతం ఆయన చేరదీస్తున్నట్లు తెలిసింది.