➥ చివరి దశకు చేరుకున్న ఇంటర్ మూల్యాంకనం


➥ మే 10న ఫలితాలు వెలువడే అవకాశం


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడటంతో.. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు తెలంగాణ విద్యార్థుల వంతైంది. ఏపిలో ఏప్రిల్ 26న ఇంటర్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్ష పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఏపీలో మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4తో ముగిశాయి. అయితే తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగాయి. కాని ఏపీలో అతి తక్కువ కాలంలో ఫలితాలు వెలువరించగా.. తెలంగాణలో మాత్రం ఫలితాల వెల్లడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారంలేదు.


మూల్యాంకన ప్రక్రియ కూడా ఏపీ కంటే ముందుగానే తెలంగాణలో ప్రారంభమైంది. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,82,619 మంది విద్యార్థులు హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే రెండో వారంలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖారులోగా వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. విద్యార్థులు ఓవైపు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తూనే ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో లీనమయ్యారు.


తెలంగాణలో ఒకవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకులు, టెన్త్ పేపర్ల లీకేజీల వ్యవహారాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో.. గత అనుభవాల దృష్ట్యా (గ్లోబరీనా వ్యవహారం) ఇంటర్ ఫలితాల విషయంలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.


Also Read:


ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల, 61 శాతం ఉతీర్ణత నమోదు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం 6.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా రెండో స్థానంలో, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలు విడుదల, 72 శాతం ఉతీర్ణత నమోదు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం 6 గంటలకు ఫలితాలనున విడుదల చేశారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75%   ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..