Visakha Kidney Racket: విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. పెందుర్తి పరిధిలో తిరుమల హాస్పిటల్ లో బాధితులు వినయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి వైద్యులు కిడ్నీ తీసుకున్నారు. చివరికి సీన్ రివర్స్ అయి పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. కిడ్నీకి 8.50 లక్షలు ఇస్తామంటూ కామరాజు అనే వ్యక్తి, శ్రీను అనే మరొకరు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారంగానే కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు బాధితుడు వినయ్ కుమార్. 
కలెక్టర్ ఆఫీస్ సమీపంలో విజయ మెడికల్ లేబ్ లో వినయ్ కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తరువాత వినయ్ కు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులు కామరాజు, శ్రీనులు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే తిరుమల హాస్పిటల్ కు లైసెన్స్ ఉండా, డాక్టర్లు నిజం డాక్టర్లా నకిలీనా అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు, అమాయకులకు డబ్బు ఆశ చూపి, కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పిస్తున్నారు. కిడ్నీ మార్పిడి జరిగాక మాట్లాడుకున్న దాని కంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు. మరిన్నివిషయాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. 


నాలుగేళ్ల కిందట ఇదే సీన్..
సరిగ్గా నాలుగేళ్ల కిందట అంటే 2019లోనూ విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి అనే వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకుని చివరికి అతడ్ని మోసం చేసింది ఓ గ్యాంగ్. కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటే మొదట రూ.12లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ పూర్తయ్యాక, పార్థసారధికి కేవలం రూ.5లక్షలు ఇవ్వడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుడు పార్థసారధి మహరాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు బహిర్గతమైంది. మొదట తన ఇష్టం మేరకే కిడ్నీ ఇచ్చినా, డీల్ కుదుర్చుకున్నంత మొత్తం తనకు ఇవ్వకపోవడంతో నష్టపోయాను, మోసపోయాను అంటూ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారని అప్పట్లో బాధితుడు పార్థసారధి ఆరోపించారు. ఆ కేసులో కొందరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ అదే సమయంలో అరెస్ట్ చేశారు.


త్రిసభ్య కమిటీ రిపోర్టులో షాకింగ్ విషయాలు
కిడ్నీ మార్పిడి, విక్రయాల అంశంపై త్రిసభ్య కమిటీని అప్పట్లోనే ఏర్పాటు చేశారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లపై త్రిసభ్య కమిటీ వివరాలు సేకరించింది. ఓ ఆసుపత్రిలో 50 నుంచి 60 వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు జరిగినట్లు నివేదికలో పేర్కొనడం సంచలనం రేపింది. కిడ్నీ మార్పిడి కోసం డీల్ జరిగినట్లు ఆధారాలు సైతం కమిటీ సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో ఇలాంటి ఆపరేషన్లు చాలా జరిగినట్లు రిపోర్ట్ చేసింది. ఈ విషయంపై త్రి సభ్య కమిటీ మహారాణి పేట పోలీసులకు లేఖ రాసింది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో భారీగా మోసాలు జరిగాయని కమిటీ బహిర్గతం చేసింది. అయితే నిజంగానే అవసరమై కిడ్నీ మార్పిడి జరిగిందా, లేద అవసరాల నిమిత్తం కిడ్నీ విక్రయాలు జరిగాయా అని దర్యాప్తు కొనసాగింది.