తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 10 నుంచి 14 వ‌ర‌కు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ ప్రవేశ‌ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్ బి. డీన్ కుమార్ విద్యార్థులకు కీల‌క ఆదేశాలు జారీచేశారు. 


మే 10 నుంచి 14 వరకు, ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉద‌యం 9 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం వేళ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు తెలంగాణ వ్యాప్తంగా 104 సెంట‌ర్లు, ఏపీలో 33 సెంట‌ర్లను ఏర్పాటు చేసిన‌ట్లు క‌న్వీన‌ర్ తెలిపారు. ఎంసెట్ ఎగ్జామ్స్ స‌జావుగా జ‌రిగేందుకు ఎస్‌పీలు, సీపీలు, విద్యుత్ అధికారులు, ఆర్టీసీ అధికారులు స‌హ‌కారం అందించాల‌ని క‌న్వీన‌ర్ కోరారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


TS EAMCET 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు..
ఎంసెట్ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ప‌రీక్షా స‌మయానికే ఒక గంట ముందుగానే చేరుకోవాల‌ని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ హాల్‌టికెట్‌పై పొందుప‌రిచిన నిబంధ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు కేటాయించిన తేదీ, స‌మ‌యంలోనే ప‌రీక్షల‌కు అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఆ స‌మ‌యానికి అటెండ్ కాక‌పోతే.. ఇత‌ర సెష‌న్లకు అనుమతించే ప్రస‌క్తే లేద‌ని ఆయన స్పష్టం చేశారు.


ఎంసెట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 137 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు!
తెలంగాణ ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ పరిశీలకుడిని నియమించారు. మే 10 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ పరీక్ష పర్యవేక్షణకు గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్‌ పరిశీలకుడు ఉండగా.. ఈ సారి సిట్టింగ్‌ స్క్వాడ్‌ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్‌కూ ఓ పరిశీలకుడు ఉండనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్‌ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్‌కు 29 పరీక్షా కేంద్రాలు పెంచారు. 


ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఆన్‌లైన్‌ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేసేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.


కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు..
ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ ప్రాంగణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో బీటెక్‌ బయో టెక్నాలజీ బ్రాంచీని ప్రవేశ పెడుతున్నారు. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉండనుంది. అదేవిధంగా కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయి.  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..