Pariksha Pe Charcha 2024 7th Edition: పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోదీ సోమవారం పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమం నిర్వహించారు.  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు, సూచనలిచ్చారు. 


'పరీక్షా పే చర్చ’లో ప్రధాని మోదీ ఏమన్నారంటే..?


➥ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. విద్యార్థులు తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. 


➥ కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. తద్వారా పరీక్షలు బాగా రాయగలరు. 


➥ మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.


➥ తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తమ సొంత విజిటింగ్ కార్డ్‌గా భావిస్తున్నారు. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది సరైన విధానం కాదు. 


➥ ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి. 


➥ విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుంది. వీటిని అధిగమించాలి. పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీపడండి.


➥ విద్యార్థులే దేశ భవిష్యత్తు రూపకర్తలు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ 'పరీక్షా పే చర్చ కార్యక్రమం' నాకూ పరీక్ష లాంటిది. 


➥ ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి.


➥ విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలి.


విద్యార్థుల ఎగ్జిబిషన్.. 
పరీక్షాపే కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ప్రజెంటేషన్లను ప్రధాని మోదీ వీక్షించారు. వారితో సరదగా గడిపారు. విద్యార్థుల నుంచి ప్రజెంటేషన్ విషయాలను అడిగి తెలుసుకున్నారు.