PG Medical Admissions: దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్గదర్శకాలు (NMC Guidelines) జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది.


అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలోని పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్.. ఇటీవల వెలువరించిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు-2023 లో స్పష్టం చేసింది.


రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు అని ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


జులై మొదటి వారంలో నీట్‌ పీజీ..
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌ పీజీ) జులై మొదటి వారంలో జరిగే అవకాశముంది. కౌన్సిలింగ్‌ ఆగస్టు మొదటి వారంలో జరగనుందని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్టు (NEXT)ను ఈ ఏడాది నిర్వహించడం లేదని తెలిపాయి. 2018 పీజీ వైద్య విద్య నిబంధనలను సవరించి ఇటీవల నోటిఫై చేసిన పీజీ వైద్య విద్య నిబంధనలు-2023 ప్రకారం.. నీట్‌ పీజీ పరీక్ష జరగనుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్‌ అమల్లోకి వచ్చే వరకూ కొత్త నిబంధనల ప్రకారం నీట్‌ పీజీ జరగనుంది.



ALSO READ:


ఇంజినీరింగ్ కాలేజీల్లో మరిన్ని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు, పరిమితి ఎత్తివేసిన ఏఐసీటీఈ!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో (TS Engineering Colleges) వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నాటికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అధికంగా ఉండనున్నాయి. రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సంబంధిత సీట్ల (Computer Science Seats) సంఖ్య ఇప్పటికే 75 శాతానికిపైగా ఉండగా.. ఈసారి మరిన్ని సీట్లు పెరుగున్నాయి. సీట్ల సంఖ్యపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేయడంతో సీట్లు భారీగా పెరునున్నాయి. నిబంధనలను పాటించే కళాశాలలకు ఒక్కో విభాగానికి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడంలేదు. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు తెచ్చుకోవచ్చు. కళాశాలల్లో సీట్లకు అనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపకులు ఉంటే చాలు. మూడేళ్లపాటు అనుమతులు మంజూరు చేయడమే కాకుంగా.. పరిమితికి మించి ఎక్కువ సీట్లను ఇస్తారు.  యూజీసీ స్వయంప్రతిపత్తి/న్యాక్-ఏ గ్రేడ్/30 శాతం కోర్సులకు (NBA) గుర్తింపు, వరుసగా అయిదేళ్లపాటు 80 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకు ఈ వెసులుబాటు కల్పించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...