NVS Exam Halltickets: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఫేజ్-2 ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డును అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకొని పరీక్ష రోజు వరకు భద్రపరచుకోవాలి. పరీక్షకు హాజరయ్యేవారు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు. విద్యార్థులు హాల్‌టికెట్‌లోని నిబంధనలు క్షుణ్నంగా చదివి, పరీక్షరోజు పాటించాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌లో అభ్యర్థులు తమ ఫొటో, సంతకం ఉన్నాయో లేదా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 20న నవోదయ ప్రవేశపరీక్ష(ఫేజ్-2) నిర్వహించనున్నారు. 


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..


మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు.


➥ సెక్షన్‌-1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 


➥ సెక్షన్‌-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. 


➥ సెక్షన్‌-3 అనేది లాంగ్వేజ్‌ టెస్ట్‌. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.


అర్హతలు..
➥ 2023-2024 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాయడానికి అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివాసి అయి ఉండాలి.


➥ ప్రవేశాల్లో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవి ఉండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.


ఉచిత విద్య, వసతి..
ఈ పరీక్షలో ఎంపికైనవారికి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. 9వ తగరతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు.


Notification


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..