CUET PG 2024 Results: దేశవ్యాప్తంగా 190 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ-పీజీ)-2024' ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 13న  ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. పరీక్ష ద్వారా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ ఉన్నాయి. 


CUET PG 2024 Results 


ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా దాదాపు 344 పీజీ కోర్సులతో పాటుగా 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు. సీయూఈటీ పీజీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్లో నిర్వహిస్తున్నారు. సీయూఈటీ పీజీ-2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు.


తుది ఆన్సర్ 'కీ' అందుబాటులో..
సీయూఈటీ పీజీ - 2024 ప్రవేశ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 12న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీ వెలువడటంతో త్వరలోనే ఫలితాలు వెల్లడించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6న విడుదలైన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.



సీయూఈటీ పీజీ పరీక్ష ఇలా:


➥ సీయూఈటీ పీజీ పరీక్షను 105 నిమిషాలపాటు సీబీటీ ఆధారంగా నిర్వహించారు. మొత్తం 75 మార్కులకు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి.


➥ సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 గంటల వరకు మూడోసెషన్‌లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరయ్యారు.


➥ ఎగ్జామ్ డిగ్రీ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకున్నారు. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించారు.


ALSO READ:


సీయూఈటీ యూజీ -2024 ద్వారా ఈ ఏడాది ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్దేశించిన 'సీయూఈటీ యూజీ' ప్రవేశ పరీక్ష పరిధిలోకి మరిన్ని యూనివర్సిటీలు వచ్చి చేరినట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ ఒక ప్రకనటలో తెలిపారు. ఈఏడాది 46 కేంద్రీయ యూనివర్సిటీలు, 32 రాష్ట్ర యూనివర్సిటీలు, 20 డీమ్డ్ వర్సిటీలు, 98 ప్రైవేటు యూనివర్సిటీలతోపాటు 6 ప్రభుత్వ విద్యాసంస్థలు సీయూఈటీ యూజీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రాలవారీగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాల యూనివర్సిటీల వివరాలను యూజీసీ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 15 నుంచి 31 మధ్య సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.  జూన్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..