గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నమైన ఈ-బైక్‌‌ను రూపొందించారు. ఆరుగురు సులభంగా ప్రయాణించగలిగేలా ఈ కొత్త ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రిపుల్ఈ, సీఎస్‌సీ, మెకానికల్ విభాగాల విద్యార్థులు దీపక్ రెడ్డి, లలిత్ కుమార్, నితిన్ చక్రవర్తి, జ్ఞానేశ్వర్ రెడ్డి, వినోద్, భరద్వాజ, మురళీ మనోజ్, చంద్రశేఖర్ భారిక్ కలిసి ఈ-బైక్ తయారు చేశారు.


ఈ కొత్త బైకులో ఆరుగురు కూర్చునేందుకు వీలుగా 4 మీటర్ల పొడవుతో రూపొందించారు. బ్యాలెన్స్ సమస్య తలెత్తకుండా అడ్వాన్స్‌డ్ డైనమిక్స్ స్టిమ్యులేషన్‌తో బరువు రెండు చక్రాలపై సమానంగా పడేలా చూసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని 30 రోజుల్లోనే రూపొందించారు. దీనిలోని బ్యాటరీలు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే వంద కి.మీ. వెళ్లొచ్చు. సౌరశక్తితోనూ ఛార్జింగ్ చేసుకోవచ్చు.


పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో కుటుంబ సభ్యులంతా ఈ బైక్‌పై సులువుగా చక్కర్లు కొట్టొచ్చు. అధికారుల పరీక్షలు పూర్తయ్యాక ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు.


ALSO READ:


విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మరొకటి ఇవ్వబోతోంది. ఆ విధానం అమల్లోకి వచ్చే పక్షంలో కేంద్రం ఇచ్చే నంబరు ఒక్కటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 1-12వ తరగతి వరకు 26 కోట్ల మంది విద్యార్థులున్నందున 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే అవకాశం ఉంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నీట్‌(యూజీ) సిలబస్‌ తగ్గింపు, ఈ సబ్జెక్టుల్లోనే ఎక్కువ కోత - విద్యార్థులపై తగ్గిన భారం!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించింది. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్‌ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్‌(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్‌ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నిపుణులు అంటున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...