WESAT Satellite Experiment: తిరువనంతపురంలోని 'లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్' కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినులు తయారుచేసిన ఉపగ్రహం వియ్‌శాట్ (WESAT - Women Engineered Satellite) ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని జనవరి 1న చేపట్టనుంది. తిరుపతి జిల్లాలోని షార్ నుంచి చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం ద్వారా 600 కి.మీ. ఎత్తు కక్ష్యలోకి శాస్త్రవేత్తలు దీనిని చేర్చనున్నారు. 


కళాశాలలో డిసెంబరు 18న జరిగిన కార్యక్రమంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ ఉన్నికృష్ణ నాయర్‌కు 'వియ్‌శాట్‌' ఉపగ్రహాన్ని అందించారు. కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిజీ అబ్రహం ఆధ్వర్యంలో విద్యార్థినులు కిలో బరువుండే ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమి ఉపరితలంపై యూవీ కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే దీని లక్ష్యం.


ఈ ఉపగ్రహం ఇచ్చే సమాచారాన్ని అధ్యయనం చేయడానికి కళాశాలలోనే గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్తల సూచనలతో 250 మంది విద్యార్థినులు, ముగ్గురు అధ్యాపకులు మూడేళ్లపాటు కృషి చేసి ఉపగ్రహాన్ని రూపొందించారు. రూ.30 లక్షలు ఖర్చు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.4 లక్షలు చొప్పున నిధులు కేటాయించాయి.


ఆలోచనే ఆయుధం..
దేశంలో ఒక్కోచోట ఒక్కోరకమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపుఉత్తర భారతంలో వరదలు ముంచెత్తుతుంటే.. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకచోట అతివృష్టి.. మరోచోట అనావృష్టి. ఇలాంటి సమస్యలు తిరువనంతపురంలోని ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్స్‌ కాలేజ్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లిజీ అబ్రహంని ఆలోచింపచేశాయి. ఇందుకు పరిష్కారంగా తన విద్యార్థినులతో ఆమె కనిపెట్టిన పరిష్కారమే 'వియ్‌శాట్‌'. ఈ కళాశాలకు అనుబంధంగా అంతరిక్ష ప్రయోగాలని అధ్యయనం చేసే 'స్పేస్‌ క్లబ్‌' సాయంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ క్లబ్‌కి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న లిజీ మూడేళ్ల క్రితం తన మనసులోని ఆలోచనల్ని విద్యార్థులతో పంచుకున్నారు. అలా మొదలైంది వియ్‌శాట్‌ ప్రయాణం. 


30 లక్షల రూపాయలతో తయారీ..
సాధారణంగా ఉపగ్రహ ప్రయోగాలకు అయ్యే ఖర్చు కోట్లలో ఉంటుంది. అయినాసరే ఈ శాటిలైట్‌ తయారీలో తమదైన ముద్ర వేయాలనుకుందీ మహిళా బృందం. వివిధ ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన 30 మంది అమ్మాయిలు ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. ఇస్రోకి చెందిన ‘ఇన్‌స్పేస్‌’ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వేతర సంస్థలు తయారు చేసే అంతరిక్ష ప్రయోగాలని పర్యవేక్షించి, మార్గదర్శకత్వం ఇస్తుంది ఇన్‌స్పేస్‌ సంస్థ. అలా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో ముందుకు నడిచారు. బృందంలో అందరూ మహిళలే కావడంతో దీనికి విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ (వియ్‌శాట్‌) అని పేరు పెట్టారు. దీని లక్ష్యం భూమి ఉపరితలంపై అతి నీలలోహిత (యూవీ) కిరణాల పరిధిని కొలవడం. ప్రస్తుతం వీరు రూపొందించిన ఉపగ్రహం ఫ్యాబ్రికేషన్‌ దశలో అంటే దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇస్రో ఆధ్వర్యంలో మరికొన్ని కఠిన పరీక్షలు నిర్వహించాక.. దీనిని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహాన్ని భూమికి 600 కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. బరువు కిలో వరకూ ఉంటుంది. దీని తయారీ కోసం రూ.30 లక్షల వరకూ ఖర్చుపెట్టారు.


కేరళ సమస్యలే ప్రేరణ..
కేరళలో గత కొంతకాలంగా విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇందుకు కారణాలు అన్వేషించాలనే వియ్‌శాట్‌ తయారీ మొదలుపెట్టినట్లు విద్యార్థి బృందానికి నాయకత్వం వహించిన షెరిల్‌ చెబుతోంది. శాస్త్రవేత్తల సలహాలతో ముందుకెళ్తున్నామని, ఇందులోకోసం కాలేజీలోనే సొంతంగా గ్రౌండ్‌ స్టేషన్‌ నిర్మించుకున్నట్లు షెరిల్ తెలిపింది. తయారీ ఖర్చులని కళాశాలే భరిస్తోందన్నారు. ప్రభుత్వం, ఏజెన్సీలు ముందుకొస్తే ఇలాంటి ప్రయోగాలు మరికొన్ని చేయాలని ఉందని ఆమె అన్నారు. గతేడాది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఆధ్వర్యంలో 750 మంది విద్యార్థినులు రూపొందించిన ‘ఆజాదీశాట్‌’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. అదే మాకు స్ఫూర్తి అని షెరిల్‌ తెలిపింది.