ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో మునుపెన్నడూ జరగని విధంగా కంటెస్టెంట్స్‌పై దాడి జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ బయటికి వస్తున్న సమయంలో వారి కార్లపై దాడులు చేశారు ఫ్యాన్స్. దీంతో ఈ రియాలిటీ షోపై ప్రజల్లో ఉన్న నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. ఇప్పటికే ఈ రియాలిటీ షో వల్ల ఏమీ లాభం లేదని, బ్యాన్ చేయాలని కొందరు ప్రజలు ఖండిస్తూ ఉండగా.. ఈ షోకు హోస్ట్ అయిన నాగార్జునను అరెస్ట్ చేయాలని తాజాగా సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై జరిగిన దాడిపై ఆయన స్పందించారు.


కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే..
బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ కార్లపై, ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై సీపీఐ నారాయణ స్పందించారు. బిగ్ బాస్‌ మ్యానేజ్‌మెంట్‌పై, నాగార్జునపై కేసులు ఫైల్ చేయాలని అన్నారు. ఆ షోను ఆయన పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇందులో మర్యాద లేని, నీచమైన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తారని వ్యాఖ్యలు చేశారు. అస్సలు సంబంధం లేనివారిని ఒక హౌజ్‌లోకి తీసుకొచ్చి.. కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసం వారితో ఏదేదో చేయిస్తారని అన్నారు నారాయణ. ముఖ్యంగా తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7లో రైతుబిడ్డ అనే పేరుతో ఒక కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి.. పల్లెటూరిలో షోకు వ్యూయర్‌షిప్ పెంచే ప్రయత్నం చేశారన్నారు. పల్లెటూళ్లలో షోకు ఆదరణ పెంచడానికి ఇదొక స్ట్రాటజీ అన్నారు.


నాగార్జున మౌనం..
ప్రతీ సందర్భాన్ని బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్.. తమకు తగినట్టుగా మార్చుకుంటుందని సీపీఐ నారాయణ ఆరోపించారు. అందుకే వెంటనే ఈ షోను బ్యాన్ చేయాలని కోరారు. ఇంత జరిగినా కూడా బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్‌తో పాటు నాగార్జున కూడా మౌనంగా ఉండడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది సమాజానికి ఏ మాత్రం మంచిది కాదని.. ముందు నుంచి వాదిస్తున్న వారు తాజాగా జరిగిన సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ అనే పేరుతో కొందరు ఆకతాయిలు రోడ్డుపైకి వచ్చి ఇలా దాడులు చేస్తుంటే.. భవిష్యత్తులో ఇంకా ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.


ఆర్టీసీ ఏండీ సజ్జనార్ స్పందన..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కొంతమంది అమర్‌దీప్ కార్‌పై దాడులు చేశారు. ఈ క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు, పోలీస్ కారుపై కూడా దాడి జరిగింది. దీంతో వాటి అద్దాలు పగిలాయి. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ పరిస్థితికి కారణమయిన ఎవ్వరినీ వదిలేది లేదని హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల ఇలా జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కూడా ఈ సందర్భాన్ని ఖండించారు. ఈ షోను కేవలం ఎంటర్‌టైన్మెంట్‌లాగా తీసుకోవాలని, బయటికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోవాలని కోరారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలామంది ఈ దాడిని ఖండిస్తూ పోస్టులు పెట్టారు.


Also Read: పల్లవి ప్రశాంత్ అభిమానులకు సోహైల్ వార్నింగ్ - వాళ్ల బద్దలు పగులుతాయ్