తెలుగులో 'బిగ్ బాస్' రియాలిటీ షో... సీజన్ 7ను పూర్తి చేసుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా... అమర్‌ దీప్ రన్నర్‌గా నిలిచాడు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌ను చూడడం కోసం ఫ్యాన్స్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా సేపు ఎదురు చూశారు. కంటెస్టెంట్స్ బయటికి రాగానే.. వారి కార్లపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఈ దాడిలో అశ్విని, గీతూ, అమర్‌ దీప్‌ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. ఫ్యాన్స్ ప్రవర్తనపై ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిరాశ వ్యక్తం చేశారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోల్ రైడా, సోహైల్ కూడా ఈ విషయంపై స్పందించారు. సోహైల్ అయితే తన విషయంలో అలా జరిగుంటే బద్దలు పగులుతాయని వార్నింగ్ కూడా ఇచ్చాడు.


ఆ కోపాన్ని బయటికి తీసుకురావద్దు..
రోల్ రైడా, సోహైల్ కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొన్నారు. బిగ్ బాస్ వల్ల జరిగిన గొడవకు, ఈవెంట్‌కు ఏం సంబంధం లేకపోయినా.. దానిపై స్పందించాలని రోల్ రైడా డిసైడ్ అయ్యాడు. ‘‘2 రోజుల క్రితం బిగ్ బాస్ షో అయ్యింది. షోలో విన్నర్‌ను ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగలగొట్టడం, దాంతో పాటు రోడ్డు మీద వెళ్తున్న ఆరు బస్సులను ధ్వంసం చేశారంట. ఇది కాదు బిగ్ బాస్ అంటే. ఎంటర్‌టైన్ చేసిన విషయం నిజమే. దాని వల్ల సంతోషమే. మేము కూడా ఎంటర్‌టైన్ అయ్యాము. కానీ ఆ ఎంటర్‌టైన్మెంట్‌ను, కోపాన్ని బయటికి తీసుకొచ్చి బస్సులు పగలగొట్టడం, కార్ల అద్దాలు పగలగొట్టడం ఖండిస్తున్నాను’’ అంటూ తన అభిప్రాయన్ని బయటపెట్టాడు రోల్ రైడా.


గీతూ తండ్రికి బాలేదు..
‘‘అక్కడికి వచ్చిన చాలామంది కంటెస్టెంట్స్‌ను ప్రేమించి, వారిని చూడాలి అని అనుకొని ఉండొచ్చు కానీ అందులో కొంతమంది ప్రవర్తన అయితే కరెక్ట్ కాదు. మీతో పాటు చాలామంది జనాలను రిస్క్‌లో పెట్టిన సందర్భం అది. బస్సుల మీద రాళ్లు విసిరిగొట్టినప్పుడు పబ్లిక్‌కు తాకితే అది హానికరంగా ఉంటుంది. వచ్చే కంటెస్టెంట్స్ కూడా చాలామంది తమ కుటుంబ సభ్యులతో ఉన్నారు. తాజాగా ఒక వీడియో చూశాను. బయట కార్లు ధ్వంసం చేస్తున్నారని తెలిసిన తర్వాత గీతూ రాయల్ గంటసేపు ఆగింది. కానీ ఆ గంట తర్వాత కూడా తన తండ్రికి బాలేదని బయటికొచ్చింది. అయినా కూడా చాలామంది హీనంగా ప్రవర్తించారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టినా కూడా మేము అలానే ఉంటాం, అలాగే చేస్తాం అని మెసేజ్‌లు చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చాడు రోల్ రైడా. 


అప్పుడే సమాజం బాగుంటుంది..
రోల్ రైడా చేసిన వ్యాఖ్యలపై, కంటెస్టెంట్స్‌పై జరిగిన దాడిపై సోహైల్ కూడా స్పందించాడు. ‘‘ఫ్యామిలీ ఉన్నారు లోపల. అంతమంది అద్దాలు పగలగొడుతున్నారు. పగలగొట్టేవాళ్లది తప్పే కాదనట్లేదు. కానీ డ్రైవ్ చేసేవాళ్లది కూడా తప్పు ఉంది. వాళ్లు సైలెంట్‌గా ఉండకుండా రివర్స్ గేర్ వేసి వెళ్లి గుద్ది, మళ్లీ ఫ్రంట్ గేర్ వేసి ముందు ఉన్నవాళ్లను కూడా గుద్దుకుంటూ వెళ్తే అప్పుడు సమాజం బాగుంటుంది. నేనైతే అదే చేసేవాడిని. నా కారు అద్దం పగలగొడితే వాళ్ల బద్దలు పగులుతాయి’’ అంటూ డైరెక్ట్‌గా అలా చేసేవాళ్లకి వార్నింగ్ ఇచ్చాడు.


Also Read: ‘ఆదిపురుష్‌’ ఎలా ఉన్నా, ‘హనుమాన్‌’ ఇలాగే ఉంటుంది- ప్రశాంత్‌ వర్మ