దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు.


పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మరొకటి ఇవ్వబోతోంది. ఆ విధానం అమల్లోకి వచ్చే పక్షంలో కేంద్రం ఇచ్చే నంబరు ఒక్కటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 1-12వ తరగతి వరకు 26 కోట్ల మంది విద్యార్థులున్నందున 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే అవకాశం ఉంది. 


ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఆయా విద్యార్థుల వివరాలను కేంద్ర విద్యాశాఖ గత కొన్నేళ్లుగా సేకరిస్తోంది. ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్) ద్వారా ఆ గణాంకాలను తీసుకుంటోంది. అయితే ఈ విధానంలో సదరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, చదువు మానేసినా వారి వివరాలు తెలుసుకునే వీలుండదు. విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడా? లేదా అనేదీ తెలియడం లేదు. విద్యార్థుల ప్రతిభను నమోదుచేసే అవకాశం ఈ విధానంలో లేదు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానంలోనే నిర్ణయించారు.


కేంద్రం ఈ విధానం అమలుకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి ఛైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్‌షిప్స్ తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణపత్రాలను భౌతికంగా కాకుండా, డిజిటల్‌లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది. అన్ని వివరాలు నమోదు చేసినట్లే పరిగణిస్తాం అని ఏఐసీటీఈ వర్గాలు చెబుతున్నాయి.


ALSO READ:


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్‌' కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...