ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష (ఏపీ ఈసెట్‌) - 2021 పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఏపీ ఈసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఏపీ ఈసెట్ పరీక్షను నేడు (సెప్టెంబర్ 19) హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఈసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్ధన, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సి. శశిధర్‌ తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధనల అమలులో ఉందని.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. 


ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు బీటెక్ సెకండియర్‌లోకి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 13 బ్రాంచీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్ష కోసం 34,271 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 7 బ్రాంచ్‌లకు సంబంధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. మిగతా 6 బ్రాంచ్‌ల వారికి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.  


బ్రాంచ్‌ల వారీగా దరఖాస్తుల వివరాలు.. 
మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు అత్యధికంగా 10,652 దరఖాస్తులు వచ్చాయి. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌కు (ఈఈఈ) 7,760.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌కు (ఈసీఈ) 6,330 మంది దరఖాస్తు చేసుకున్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌కు 5,606, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌కు (సీఎస్ఈ) 2,249 దరఖాస్తులు వచ్చాయి. అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు 420, కెమికల్‌ ఇంజనీరింగ్‌కు 371, మైనింగ్‌ ఇంజనీరింగ్‌కు 292, మెటలర్జికల్‌కు 147, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెన్‌టేషన్‌ ఇంజనీరింగ్‌కు 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఫార్మసీకి 140, బీఎస్సీ (మేథమేటిక్స్‌)కు 58, సిరామిక్‌ టెక్నాలజీకి 6 దరఖాస్తులు అందాయి. 


ఈ నిబంధనలు మర్చిపోకండి.. 
► ఉదయం సెషన్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 7.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాలి.
► మధ్యాహ్నం సెషన్‌ పరీక్షకు హాజరయ్యే వారు 1.30 గంటలకు ఆయా ఎగ్జామ్ సెంటర్ల వద్ద రిపోర్ట్‌ చేసుకోవాలి. 
► మొబైల్‌ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.
► బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి చేతులకు గోరింటాకు, మెహందీ, టాటూ మార్కులు ఉండకూడదు. 
► పరీక్ష సమయం ముగిసే వరకూ విద్యార్థులను సెంటర్ నుంచి బయటకు పంపరు.


Also Read: IGNOU July 2021: ఇంటి నుంచే డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? 'ఇగ్నో' గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..


Also Read: AP EDCET 2021: 21న ఏపీ ఎడ్‌సెట్‌.. 24 నుంచి పీఈసెట్.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్‌లు ఇవే..