Anantapur: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టినవారు ఎవరైనా సహించలేదని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్టు చేశారు. 


సెప్టెంబర్‌ 23న అర్ధరాత్రి సమయంలో అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముల వారి రథానికి నిప్పు పెట్టారు. మండపంలో భద్రపరిచిన ఉండగా దుండగులు ఈ పని చేశారు. తాళాలు పగులకొట్టి, మండపంలోకి ప్రవేశించి రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే రథం ముందు భాగం కాలిపోయింది. 


ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు గుర్తించారు. హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో ఎర్రస్వామి రెడ్డి బ్రదర్స్‌ సొంత డబ్బులు 20 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు. ఇదే గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది. ఆ విభేదాలతోనే రథానికి నిప్పు పెట్టారు. 


రాయదుర్గం సీఐ వెంకటరమణ ఎస్ఐ నాగ మధు ఆధ్వర్యంలో కేసు విచారించి వైసిపి కార్యకర్త బొడిమల్ల ఈశ్వర రెడ్డిని అరెస్టు చేశారు. బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే సహాయం చేసిన వారి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 


Also Read: దసరా నుంచి దీపావళి వరకు - అక్టోబర్‌లో బ్యాంక్‌లకు భారీగా సెలవులు