Stock Market News Updates Today in Telugu: ఈ వారంలోని మొదటి రెండు రోజుల్లో నూతన శిఖరాలు అధిరోహించిన దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి కనిపిస్తోంది. ఈ రోజు (బుధవారం, 25 సెప్టెంబర్‌ 2024) బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 150 పాయింట్లు పడిపోయింది. ఐటీ స్టాక్స్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఫైనాన్షియల్‌ షేర్లు కూడా ఈ రోజు పడిపోయాయి. మెటల్‌ సెక్టార్‌లో మాత్రం మెరుపులు కంటిన్యూ అవుతున్నాయి. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (మంగళవారం) 84,914 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు దాదాపు 78 పాయింట్ల స్వల్ప నష్టంతో 84,836.45 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 25,940 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 41 పాయింట్లు తగ్గి 25,899.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ఓపెనింగ్‌ తర్వాత మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 84,880 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టంతో 25,935 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి.


ప్రారంభ నిమిషాల్లో... సెన్సెక్స్‌లో దాదాపు 20 షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ దాదాపు 0.80 శాతం పడిపోయింది. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి లార్జ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు క్షీణించాయి. మరోవైపు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ వంటి షేర్లు కూడా మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి.


ఉదయం 09.55 గంటలకు, BSE సెన్సెక్స్ 31.99 పాయింట్లు లేదా 0.03% పెరిగి 84,946.03 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 2.45 పాయింట్లు పెరిగి 25,942.85 దగ్గర ట్రేడవుతోంది.


ప్రి మార్కెట్‌
ట్రేడింగ్ ప్రారంభానికి ముందే మార్కెట్‌లో ఒత్తిడి సంకేతాలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 80 పాయింట్ల నష్టంతో 84,835 పాయింట్లకు, నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంతో 25,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఉదయం, GIFT నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా దాదాపు 20 పాయింట్ల జారిపోయి 25,925 వద్ద ఉన్నాయి.


దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి రెండు రోజుల్లో కొత్త జీవితకాల గరిష్ట స్థాయులను నమోదు చేసింది. సోమవారం సెన్సెక్స్‌ 84,980.53 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,956 పాయింట్ల వద్ద కొత్త రికార్డు సృష్టించాయి. మంగళవారం మళ్లీ కొత్త శిఖరాగ్రానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 85000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 26000 పాయింట్ల స్థాయిని దాటగలిగింది.


గ్లోబల్‌ మార్కెట్లు
మంగళవారం అమెరికా మార్కెట్లు ఆశావహంగా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.20 శాతం పెరిగింది. S&P 500 ఇండెక్స్ 0.25 శాతం, టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్ 0.56 శాతం ర్యాలీ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, ఈ రోజు, జపాన్‌కు చెందిన నికాయ్‌ ఫ్లాట్‌గా ఉంది, టోపిక్స్ 0.3 శాతం పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.4 శాతం, కోస్‌డాక్ 0.43 శాతం ముందంజలో ఉన్నాయి. హాంగ్‌ కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ శుభారంభం చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: రాత్రికి రాత్రే పెరిగిన ఇంధనం రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి