Young Man Halchal Infront Of Minister Convoy: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి కాన్వాయ్‌ను ఆరుగురు యువకులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు అడ్డంగా పడుకొని నానా హంగామా చేశారు. కోనసీమ జిల్లా (Konaseema District) గంగవరం మండలం మసకపల్లిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డగించారు. 'మేము కాపులం' అంటూ మంత్రి వాహనం ముందు బట్టలిప్పి మరీ హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పోలీసులు, స్థానికులు సద్దిచెపుతున్నా వారు వినలేదు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరు రాజమండ్రికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 

మరో మంత్రికి తప్పిన ప్రమాదం

 

అటు, మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ఆదివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పాలేటిపాడులో ఆదివారం పోలేరమ్మ కొలుపులకు మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రదర్శనకు సిద్ధంగా ఉంచిన ఎద్దుల పక్కనే నేతలు మంత్రితో ఫోటో దిగేందుకు యత్నించగా ఎద్దులు ఆయన వైపునకు దూసుకొచ్చేందుకు యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన మంత్రి భద్రతా సిబ్బంది, స్థానికులు ఎద్దులను పక్కకు తప్పించడంతో ఆయనకు ముప్పు తప్పింది.