Hyderabad Latest News: రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణమైన రీతిలో హత్య జరిగింది. ఎల్బీ నగర్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలోనే గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ మహిళను అర్ధరాత్రి గొంతు కోసి దుండగులు చంపినట్లుగా గుర్తించారు. ఆ మహిళ స్థానికంగా ఉండి భిక్షాటన చేసే మహిళగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ చేరుకొని.. ఆధారాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆ తర్వాత హత్యకు గల కారణాలను విచారిస్తామని ఎల్బీ నగర్ పోలీసులు వెల్లడించారు.


ఆ మహిళ మృతదేహానికి చుట్టూ రక్తపు మడుగు ఉండడంతో అక్కడి దృశ్యం జుగుప్సాకరంగా ఉంది. పోలీసు కమిషనరేట్ కు దగ్గర్లోనే ఈ హత్య జరగటం స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడూ పోలీసులు, పోలీసు వాహనాల పెట్రోలింగ్ ఉండే ఏరియాలో ఆ హత్య జరిగింది. అంతగా అలికిడి ఉన్న ఏరియాలో మహిళను దారుణంగా హత్య చేయటం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ సీపీ కార్యాలయం పక్కనే హత్య జరగటంతో పోలీసులు కూడా ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు.