Woman Forceful Death In Eluru: ఏలూరు జిల్లాలో (Eluru District) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా చూసుకునే భర్త, ఇద్దరు పిల్లల మరణాన్ని తట్టుకోలేని ఓ మహిళ మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కవ్వకుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), దేవి (36) కుటుంబం పందెం కోళ్లను పెంచి అమ్ముతుంటుంది. వారి కుమారులు మణికంఠ (15), సాయికుమార్ (13) పందెం కోడితో ఈత కొట్టించడానికని బుధవారం పోలవరం కుడి కాలువ వద్దకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయారు.


ఇది గమనించిన వెంకటేశ్వరరావు సైతం కుమారులను రక్షించడానికి కాలువలో దిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒకేసారి భర్త, పిల్లలు దూరం కావడంతో దేవి తీవ్ర మనస్తాపం చెందింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కుటుంబమంతా చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 


ప్రకాశం జిల్లాలో దారుణం


అటు, ప్రకాశం జిల్లాలో (Prakasam District) దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి, నానమ్మ, తాతయ్య కర్కశంగా వ్యవహరించడంతో.. పుట్టిన 2 నెలలకే ఓ చిన్నారి బందీగా మారి బలైపోయింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండలోని డ్రైవరుపేటకు చెందిన షేక్ సందానీబాషాకు.. పాకలకు చెందిన షేక్ రషీదాతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడాది తర్వాత ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది జులై 31వ తేదీన ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలలో రషీదా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పుట్టినబిడ్డ 2 నెలల కిందట అనారోగ్యానికి గురి కాగా.. స్థానిక వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. 


అయితే, భర్త, అత్తమామల నిర్లక్ష్యంతో ఆ పాపకు వైద్యం అందించకుండా ఇంటి వద్దనే ఓ గదిలో తల్లికుమార్తలను బంధించారు. దీంతో సెప్టెంబర్ 26న పాప చనిపోయింది. ఈ నెల 3న బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 5న భర్త, అత్తమామలను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Crime News: పండుగ పూట దారుణం- అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం - బాధితులకు అండగా ఉంటామన్న బాలకృష్ణ