Kolkata Doctor Case: అత్యాచార ఘటన గురించి తెలియగానే మన నెత్తురు ఉడికిపోతుంది. ఎటు పోతోందీ సమాజం అని ఎక్కడి లేని కోపం వచ్చేస్తుంది. అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారని అంతర్మథనం మొదలవుతుంది. మానవత్వం చచ్చిపోతోందని చాలా చిరాకు పడిపోతాం. అదే ఎమోషన్‌ని సోషల్ మీడియాలోనూ క్యారీ చేస్తాం. పెద్ద పెద్ద పోస్ట్‌లు పెడతాం. "ఇలాంటి వాళ్లని ఉరి తీయాల్సిందే" అని చాలా గట్టిగా తేల్చి చెప్పేస్తాం. హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి ట్రెండ్ చేస్తాం. ఇదంతా మనలో ఉన్న కోపాన్ని చూపించుకోడానికి ఓ దారి. ఈ ఎమోషన్‌ ఎవరికైనా ఉంటుంది. అదేం తప్పు కాదు. ఇలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా మన వాయిస్ వినిపించాల్సిందే. కానీ...మనం ఆ భావోద్వేగాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఇలాంటి అత్యాచార ఘటనల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. కోల్‌కత్తా కేసు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అందరూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ స్థాయిలో అన్యాయాన్ని ప్రతిఘటించడం చాలా మంచి విషయం. 


కానీ...మన ఎమోషన్‌ అనేది చట్టాన్ని లోబడే ఉండాలన్న సంగతి అసలు మరిచిపోకూడదు. అత్యాచార ఘటనల్లో బాధితురాలి పేరు, ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోలతో పాటు బంధువుల పేర్లు కూడా ఎక్కడా పోస్ట్ చేయకూడదు. మీడియాకి ఇది చాలా కచ్చితంగా వర్తిస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఇదే ఫాలో అవ్వాలి. కానీ కోల్‌కత్తా డాక్టర్‌ కేసులో మాత్రం ఈ రూల్‌ని చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. బాధితురాలి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆమె పేరుతో ఏకంగా ఓ హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసేశారు. ఇదంతా చట్టాన్ని ఉల్లంఘించడమే. మన చట్టం ప్రకారం ఇవన్నీ నేరాలే. ఇప్పటికే ఆమె ఫొటోలు పోస్ట్ చేసిన వాళ్లను గుర్తించి పోలీసులు నోటీసులు పంపుతున్నారు. (Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్‌కి హాస్పిటల్‌ రహస్యాలు తెలిశాయా! అందుకే ఇంత దారుణంగా చంపారా - ఏంటీ మిస్టరీ?)


చట్టం ఏం చెబుతోంది..?


కథువా అత్యాచార కేసులో మీడియా సంస్థలు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి రిపోర్టింగ్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు ఒక్కో సంస్థకి రూ.10 లక్షల జరిమానా విధించింది. బాధితారులి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించరాని నేరం అని అప్పుడే కోర్టు తేల్చి చెప్పింది. Bharatiya Nyaya Sanhita ప్రకారం అత్యాచార బాధితురాలి ఐడెంటిటీని బయటపెట్టడం నేరం. ఇలా చేసిన వాళ్లకి రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. అధికారిక సంస్థలకు తప్ప బాధితురాలి వివరాలు మరెవరికీ వెల్లడించకూడదు అనేది చట్టంలోని నిబంధన. అంతెందుకు. బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా ఈ వివరాలు చెప్పకూడదు. వాళ్లు ఈ పని చేసినా అది నేరంగానే పరిగణిస్తారు. ఇదంతా ఎందుకు అంటే...అత్యాచార బాధితులను సమాజం చూసే తీరు అభ్యంతరకరంగా ఉండడం వల్ల. వాళ్ల కుటుంబ సభ్యులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. అందుకే...ఐడెంటిటీ వెల్లడించకూడదని న్యాయస్థానాలు తేల్చి చెబుతున్నాయి. 


గైడ్‌లైన్స్ ఇవే..



  • మీడియాతో సహా ఎవరూ బాధితుల ఫొటోలు, వివరాలు వెల్లడించకూడదు. 

  • అత్యాచార బాధితురాలు చనిపోయినా కూడా ఐడెంటిటీ చెప్పకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా అధికారిక అనుమతి ఉంటే తప్ప వివరాలు బయట పెట్టడానికి వీల్లేదు. 

  • ఈ కేసులకు సంబంధించి FIR కాపీలనూ బయట పెట్టకూడదని చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. 

  • అత్యాచార బాధితులకు సంబంధించిన వివరాలన్నీ పోలీసులు చాలా గోప్యంగా ఉంచాలి. ఆ డాక్యుమెంట్స్‌కి సీల్‌ వేయాల్సిందే. 

  • పోక్సో కేసులలో బాధితురాలు అంగీకరిస్తే తప్ప పేరు బయట పెట్టకూడదు. 


Also Read: Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు