Warangal Crime : కుటుంబ కలహాలతో భార్యపై కొడవలితో దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఫిరంగడ్డ ప్రాంతానికి చెందిన రామచంద్రుకి ముగ్గురు భార్యలు. చిన్న భార్య ఎల్లమ్మతో కొంతకాలంగా గొడవలు జరుగుతుంది. శనివారం తెల్లవారు జామున గొడవ జరగడంతో భార్య ఎల్లమ్మపై కొడవలితో దాడి చేశాడు రామచంద్రు. రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసిన కూతురు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాధితురాలిని ఎంజీఎం హాస్పటల్ తరలించారు. 


మద్యం మత్తులో గొడవ, నిండు ప్రాణం బలి 


.మద్యం మత్తులో తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల రాజు అనే వ్యక్తి శుక్రవారం ఊళ్లోని ఓ మద్యం షాపునకు వెళ్లి మద్యం సేవిస్తుండగా సాంబరాజు అనే వ్యక్తితో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో సాంబరాజు అనే వ్యక్తి రాజుపై దాడి చేయగా తలకు బలమైన గాయలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. రాజు మృతికి కారణమైన సాంబరాజు ఇంటి ఎదుట రాజు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. 


బాలికపై హత్యాచారం 


 సంక్రాంతి పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. పండగ అయిపోయాక తిరిగి వెళ్లే క్రమంలో.. గ్రామానికి చెందిన ఓ యువకుడి కారులో ఎక్కింది. అందులో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. బస్సు ఆగే దగ్గర దింపారు. అక్కడే సదరు యువకుడికి బట్టల షాప్ ఉండటంతో ఎండలో ఏం నిల్చుంటావు లోపలికి రా అని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. భయపడ్డ యువకులు ఆమెను తీసుకొని స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. స్పృహ తప్పి పడిపోయిందని చెప్పగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 


అసలేం జరిగిందంటే...?


హైదరాబాద్ కు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక అమ్మానాన్నలతో కలిసి ఉంటోంది. కానీ సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా ఏపీపల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. పండుగను అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. తిరిగి మంగళవారం రోజు హైదరాబాద్ కు పయనమైంది. పెద్ద అడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందిన యువకులు నరేష్, శివ, దిలీప్ కారులో అంగడిపేట క్రాస్ రోడ్డు వద్దకు వెళ్తుండగా... పరిచయస్తులే కావడంతో అక్కడి వరకు వస్తానని బాలిక వారి కారు ఎక్కింది. క్రాస్ రోడ్డు వద్ద కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా బస్టాప్ ఎదురుగానే నరేష్‌కు బట్టల షాపు ఉంది.  ఎండలో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికను.. సదరు యుకులు లోపలికి రమ్మని పిలిచారు. ఎండలో ఉండే బదులు.. ఇక్కడ ఫ్యాన్ కింద హాయిగా కూర్చొని వేచి చూడమని చెప్పారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు దుకాణం తలుపులు మూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక స్పృహ తప్పి పడిపోయింది. భయపడిపోయిన యువకులు.. బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే నరేష్, శివ, దిలీప్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.