చిన్న అనుమానం... పచ్చని సంసారంలో చిచ్చ పెడుతుంది. అన్యోన్యంగా ఉండే దంపతులను విడదీస్తుంది. స్నేహితులను రాక్షసులను చేస్తుంది. హత్యలు చేయిస్తుంది...  హంతకులుగా మారుస్తుంది. జీవితాలను నాశనం చేస్తుంది. అనుమానం పుడితే... బతుకు సర్వనాశనమే. ఇందుకు మరో నిదర్శనమే విశాఖలో జరిగిన కిషోర్‌ హత్య.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖనగరం రామాటాకీస్‌ దగ్గర శ్రీనగర్‌లో ఉంటున్న శివకుమార్‌ అలియాస్‌ శివారెడ్డికి పెళ్లైంది. భార్య ఉంది. శివారెడ్డి మద్యానికి బానిస, గంజాయి తాగే అలవాటు కూడా  ఉంది. ఇన్ని వ్యసనాలు ఉన్నవాడు.. ఇంట్లో సక్రమంగా ఉంటాడా...? తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఆమె విసిగిపోంది. ఎంత చెప్పిన భర్త తీరులో  మార్పురాకపోవడంతో... అతనికి దూరంగా ఉండటమే మేలుకుంది. కొన్నాళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఇక్కడి నుంచే అనుమానం మొదలైంది శివారెడ్డికి.


శివారెడ్డికి... రెల్లివీధికి చెందిన కిరణ్‌ స్నేహితుడు. అతని ద్వారా కలిశెట్టి కిశోర్‌ పరిచయం అయ్యాడు. వీరి మధ్య స్నేహం మొదలైంది. ఇంటికి వస్తూ పోతూ ఉండటంతో...  శివారెడ్డి భార్య కూడా కిషోర్‌కు తెలుసు. కిషోర్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అయితే... పుట్టింటికి వెళ్లిపోయిన శివారెడ్డి భార్యకు.. కిషోర్‌  స్నేహితుడు ఉదయ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త శివారెడ్డి కోపంతో రగిలిపోయాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. కిషోర్‌ స్నేహితుడు తన  భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేకపోయాడు. ఇదంతా కిషోర్‌ వల్లే జరుగుతుందని అనుకున్నాడు. అతడి వల్లే.. తన భార్య తనకు కాకుండా పోయిందన్న అక్కసు  పెంచుకున్నాడు. ఇందేముందే ఆవేశంలో ఆలోచన చచ్చిపోయింది. రాక్షసత్వం బయటకు వచ్చింది. కిషోర్‌ను చంపేస్తేనే మనశ్శాంతి ఉంటుందనుకున్నారు శివారెడ్డి. 


తన భార్య కిషోర్‌ ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉండటానికి కిషోరే కారణమని భావించిన శివారెడ్డి... కిషోర్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ చేసుకున్నాడు. పథకం ప్రకారం అతనితో  మరింత స్నేహంగా ఉన్నట్టు నటించాడు. శివారెడ్డి... కిషోర్‌ పూర్తిగా నమ్మాడు. ఆదివారం రాత్రి మద్యం తాగేందుకు శ్రీనగర్‌లోని తన అపార్టుమెంటుకు స్నేహితులను పిలిచాడు  శివారెడ్డి. దీంతో దేవా, కిరణ్‌ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు కిశోర్‌ కూడా అక్కడికి వెళ్లాడు. నలుగురూ ఫుల్లుగా మందుకొట్టారు. ఉన్నట్టుండి... కిషోర్‌ను పక్కకుతీసుకెళ్లాడు  శివారెడ్డి. మిగతా ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని అనుకున్నారు. కానీ... కిశోర్‌ను మూడో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు శివారెడ్డి. ఆ తర్వా అక్కడి నుంచి  వెళ్లిపోయాడు. పెద్దశబ్ధం రావడంతో... ఏం జరిగిందో అని మిగిలిన ఇద్దరు స్నేహితులు కిందికి చూశారు. అక్కడ కిషోర్‌ రక్తపుమడుగులో పడివున్నాడు. వెంటనే అతన్ని  ఆస్పత్రికి తరలించారు. కానీ.. చికిత్స పొందుతూ కిషోర్‌ చనిపోయాడు. కిషోర్‌ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివారెడ్డి  కోసం గాలిస్తున్నారు.


చిన్న అనుమానం... ఒక మనిషిని ఎంతగా దిగజార్చగలదో చెప్పేందుకు ఈ ఘటనే ఒక నిదర్శనం. ఈ కేసులో అసలు ఏం జరిగింది..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. శివారెడ్డి స్నేహితులను విచారిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న మిగిలిన ఇద్దరు స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. హత్యకు ముందు ఏం జరిగింది...? వారి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా అన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు.