Viral News:


యూపీలో దారుణం..


యూపీలో 8 నెలల గర్భంతో ఉన్న కూతురుని తల్లిదండ్రులు దారుణంగా చంపేశారు. తాము చెప్పినట్టు వినలేదన్న కోపంతో గొంతు కోసి హత్య చేశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రియుడితో కలిసి ఆ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ తరవాత రెండు నెలల పాటు ఆచూకీ కోసం గాలించారు. డిసెంబర్‌లో ఇద్దరినీ గుర్తించారు. ఆ యువతిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ యువకుడిపై కేసు పెట్టారు యువతి తల్లిదండ్రులు. ఈ కేసు ఆధారంగా జైలుకి పంపారు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఆ యువకుడు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. కోర్టులో విచారణ జరిపిన సమయంలోనూ ఇదే చెప్పాలని బలవంతం చేశారు. కానీ అందుకు ఆ యువతి అసలు ఒప్పుకోలేదు. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు కన్న కూతురిపైనే దాడి చేశారు. గొంతు కోసి చంపారు. ఆ తరవాత మృతదేహాన్ని దగ్గర్లోని ఓ నదిలో విసిరేశారు. పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు యువతి రావాల్సి ఉన్నా...ఆమె రాకపోవడంపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీశారు. తల్లిదండ్రుల్ని విచారించారు. తామే హత్య చేసినట్టు వాళ్లు అంగీకరించారు. వెంటనే వాళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 


"ఆమె కోర్టులో ఏం మాట్లాడాలో తల్లిదండ్రులు ముందుగానే చెప్పారు. తప్పంతా ఆ యువకుడిదే అని స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కానీ ఆ యువతి అందుకు అంగీకరించలేదు. ఎంత చెప్పినా వినలేదు. ఈ కోపంతోనే తల్లిదండ్రులు కూతురిపై దాడి చేసి చంపేశారు"


- పోలీసులు 


మరో దారుణం..


యూపీలో ఇటీవలే దారుణం జరిగింది. ఓ ముస్లిం కుటుంబానికి చెందిన భార్యాభర్తల్ని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఐరన్‌ రాడ్‌లు, కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ యువతిని ముస్లిం యువకుడు ప్రేమించడమే కాకుండా ఈ ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోవడం రెండు కుటుంబాల్లోనూ కలకలం రేపింది. ఈ అసహనంతోనే యువతి కుటుంబ సభ్యులు ఆ ముస్లిం యువకుడి తల్లిదండ్రులపై దాడి చేశారు. అబ్బాస్, కమ్రూల్ నిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కొన్నేళ్ల క్రితం యువతీ యువకులు పారిపోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై కేసు పెట్టారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కొద్ది రోజుల క్రితమే విడుదలయ్యాడు. ఈ జంటపై దాడి చేయాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..2020లో వీళ్లిద్దరూ పారిపోయారు. అప్పటికి ఆ యువతి మైనర్. పోలీసు కేసు నమోదు చేసిన వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ మరోసారి పారిపోయారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ కోపంతోనే యువతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. యువకుడి తల్లిదండ్రులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 


Also Read: అమెరికాలో ముగ్గురి ప్రాణాలు తీసిన జాతి వివక్ష, ఓ స్టోర్‌లో గన్‌మేన్ కాల్పులు