గుజరాత్ ముంద్రా పోర్టులో హెరాయిన్‌ను తరలిస్తున్న ఏడుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ తనిఖీల్లో  దాదాపు రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ఈ ఘటనపై విజయవాడ సీపీ బత్తిని శ్రీనివాసులు స్పందించారు. గుజరాత్‌ నుంచి విజయవాడకు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమన్నారు. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్‌ తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు సీపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉన్నది వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదని స్పష్టం చేశారు. చెన్నై, అహ్మదాబాద్‌, దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని సీపీ తెలిపారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని చెన్నైలో ఉంటున్నారన్నారు. ఆయన చెన్నైలోనే స్థిరపడ్డారని సీపీ వెల్లడించారు.


అసలేం జరిగింది..


డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9 వేల కోట్ల మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాల సమాచారం అందింది. ఈ సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను తనిఖీలు చేశారు. వాటిల్లో భారీగా హెరాయిన్‌ను గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ. 9 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు అంటున్నారు. ఈ కంటైనర్లు ఏపీలోని విజయవాడకు చెందిన ఆషీ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. 


అఫ్గానిస్థాన్ టు ఇండియా


అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ తోపాటు  డ్రగ్స్ కంటైనర్లలో భారత్ కు వచ్చాయి. ఈ కంటైనర్లు అఫ్గాన్ నుంచి వచ్చినప్పటికీ ఇవి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడరు ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని వందల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి చెన్నైలో మాచవరం సుధాకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయవాడలోని ఆషీ సంస్థ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. ఆగస్టు 18న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు ఎం.సుధాకర్‌ అనే వ్యక్తి పేరు మీద ఫోన్‌ నంబర్‌ నమోదై ఉందని అధికారులు గుర్తించారు. కాకినాడకు చెందిన సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నై శివారులో నివాసం ఉంటున్నారు. ఆషీ ట్రేడింగ్ సంస్థ మూలాలు కాకినాడ, విజయవాడ, చెన్నైవరకూ విస్తరించినట్లు అధికారులు చెబుతున్నారు.


Also Read:  రూ.9 వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. అఫ్గాన్ టూ విజయవాడ వయా గుజరాత్