Adilabad Road Accident News | ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ (Adilabad) వైపు నుంచి మహారాష్ట్ర వెైపు వెళ్తున్న డీసీఎం లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్, అదనపు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్ర మత్తే కారణమా?

జందాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆదిలాబాద్  జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రదీప్ సాహు, లోచన్ సాహు అనే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారని తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ బస్సు హైదరాబాద్ నుంచి వయా నాగపూర్, జబల్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలంతో పాటు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే.ఫణిదర్, జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్సైలు సయ్యద్ ముజాహిద్ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Also Read: Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు