Sensational Issues In Tirumala Parakamani Thefting Case: తిరుమల పరకాణిలో (Tirumala Parakamani) బంగారం బిస్కెట్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారం బిస్కెట్ దొంగిలిస్తూ దొరికిపోయిన నిందితుడు పెంచలయ్యను (Penchalayya) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. గోల్డ్ బిస్కెట్ను ట్రాలీలో దాచి చోరీ చేసేందుకు యత్నించగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడు ఇదే కాకుండా గతంలోనూ బంగారు బిస్కెట్లు చోరీ చేసినట్లు తెలుస్తోంది.
రూ.46 లక్షల సొత్తు రికవరీ
నిందితుడు పెంచలయ్య నుంచి రూ.46 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల వన్ టౌన్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంటాక్ట్ ఉద్యోగిగా గత రెండేళ్ల నుంచి పని చేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను చోరీ చేయడం ప్రారంభించాడు. అతని తీరుపై అనుమానం రావడంతో విజిలెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ నెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్ను దొంగిలించి ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచాడు. దీన్ని తనిఖీల సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించగా అక్కడి నుంచి పరారయ్యాడు.
టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. పరకామణిలో గతంలో చోరీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి అవి రికవరీ చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.