Tension Situation In Punganur: చిత్తూరులో జిల్లా పుంగనూరులో (Punganuru) గురువారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. టీడీపీ కార్యకర్తలు 'మిథున్ రెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎంపీని గృహ నిర్బంధం చేశారు. కాగా, ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ పుంగనూరులో అప్పుడప్పుడూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.


గాల్లోకి కాల్పులు


పోలీసులు చెదరగొట్టడంతో కొద్దిసేపు శాంతించినా.. అనంతరం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆ ఇంటిపై దాడికి దిగాయి. వాహనం ధ్వంసం కాగా.. మిథున్ రెడ్డి గన్ మెన్లు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ దాడుల్లో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని పేర్కొన్నాయి. పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


దాడిని ఖండించిన ఎంపీ


అటు, టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని నిలదీశారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.


అటు, పల్నాడు జిల్లా వినుకొండలోనూ వైసీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే మరో వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వదిలేయమని ప్రాథేయపడినా నిందితుడు కనికరించలేదు. రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని నిర్ధారించారు.


Also Read: YS Jagan Tweet: 'ఏపీలో రాక్షస పాలన సాగుతోంది' - వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన జగన్, సీఎం చంద్రబాబుకు వార్నింగ్