Telangana Cyber Security Bureau New Software: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సరికొత్త సాఫ్ట్ వేర్ అస్త్రంతో సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ నేరం జరిగినా నిందితుడి ఆచూకీ తెలుసుకోవడం సహా.. అతనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో టీజీసీఎస్‌బీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డును సైతం ప్రకటించింది. 'సైకాప్స్' పేరుతో చేసిన ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తుండడంతో ఇదే తరహా టూల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. 


న్యూ సాఫ్ట్ వేర్.. ఒకటే క్లిక్


సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది. నిందితులు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతుండడంతో వారిని కనిపెట్టడం అధికారులకు సవాల్‌గా మారింది. దీన్ని అధిగమించేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది. సైబర్ నేరస్థుడు వాడిన ఫోన్ నెంబరును ఈ సాఫ్ట్ వేర్ ద్వారా నమోదు చేస్తే.. పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ నెంబరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి.?. ఆ సిమ్ ఎవరి పేరుతో ఉంది.?. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది.?. ఈ నెంబరు ద్వారా ఎన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి.?. ఎన్ని బ్యాంకు ఖాతాలు ఆ నెంబరుకు అనుసంధానమై ఉన్నాయి.?. వంటి వివరాలన్నీ పూర్తిగా క్షణాల్లో తెలుస్తాయి. ఒక్కసారి ఈ సమాచారం తెలిస్తే ఆ నేరాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది.


ఇలా చెక్ పెడతారు



  • పట్టుబడ్డ నిందితుడు మళ్లీ నేరాలకు పాల్పడకుండా సాఫ్ట్ వేర్ ద్వారా సేకరించిన వివరాలన్నీ కేసులు నమోదైన ఆయా రాష్ట్రాలతో పంచుకోవడం సాధ్యమవుతుంది. 

  • నిందితుడు ఎక్కడ పట్టుబడ్డా మిగతా రాష్ట్రాలు సైతం పీటీ వారెంట్ మీద తీసుకెళ్లి విచారించి, తమ కేసుల్లోనూ అరెస్ట్ చూపించే వెసులుబాటు ఉంటుంది.

  • దేశవ్యాప్తంగా నమోదైన నేరాల సంఖ్యను న్యాయస్థానంలో చూపి నిందితునికి బెయిల్ రాకుండా చెయ్యొచ్చు. అలాగే, మళ్లీ నేరాలకు పాల్పడకుండా చెక్ పెట్టొచ్చు.

  • సిమ్ కార్డు, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలతో పాటు ఫోన్లు కూడా బ్లాక్ చెయ్యించొచ్చు. ఇలా తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకూ 36,749 సిమ్ కార్డులు, 8,300 ఫోన్లు బ్లాక్ చేయించారు. 

  • 671 మంది సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 77 వేల మోసాలకు పాల్పడినట్లు గుర్తించగలిగారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా అసలు నేరస్థుడిని పోలీసులు సులువుగా గుర్తిస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారు. 

  • అటు, అపరిచిత కాల్స్, లింక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.


Also Read: Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్