Tamil Nadu Crime News: తమిళనాడులో ప్యాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ కార్‌లో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే అప్రమత్తమై నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిండిగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కనే పార్క్ చేసిన కార్‌లో మహిళ మృతదేహం కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అనుమానితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రోడ్డు పక్కనే కొంత దూరంలో గొయ్యి తవ్వి ఆ మృతదేహాన్ని పాతి పెట్టాలని ప్రయత్నించారు నిందితులు. ఆ సమయంలోనే ప్యాట్రోల్‌ సిబ్బంది వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఆ మహిళ డెడ్‌బాడీని అటాప్సీ రిపోర్ట్ కోసం పంపారు. తిరుప్పూర్‌లో ఓ మిల్‌లో పని చేస్తున్న 27 ఏళ్ల ప్రిన్సీకి నిందితుల్లో ఒకరైన దివాకర్‌తో పరిచయం ఉంది. చాలా రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే...దివాకర్ ఆమెని ఎలాగైనా వదిలించుకోవాలని చూశాడు. అప్పటి వరకూ గిఫ్ట్‌లుగా ఇచ్చిన బంగారంతో పాటు డబ్బునీ వెనక్కి ఇచ్చేయాలని బెదిరించాడు. ఆమెని ఓ చోటకు రమ్మని చెప్పి అక్కడే గొంతుకి నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు. ఆ తరవాత మరో నిందితుడు కార్‌లో వచ్చాడు. ఆ కార్‌లో డెడ్‌బాడీని దాచేసి కొంత దూరం వరకూ వచ్చారు. అనువైన ప్లేస్ చూసుకుని పాతిపెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్యాట్రోలింగ్‌ సిబ్బంది గమనించి పట్టుకున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.