Navadeep Lost Movie Offers : తెలుగు సినీ అభిమానులకు హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘జై’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవదీప్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘చందమామ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా కొన్ని హిట్స్ పడినా, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.


నవదీప్ పై బోలెడు రూమర్స్


నవదీప్ విషయంలో అప్పట్లో చాలా రూమర్స్ వినిపించేవి. ఒకేసారి వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించాడనే విమర్శలు వచ్చాయి. ఆయనకు ఉన్న వ్యసనాల కారణంగానే స్టార్ హీరోగా ఎదగలేకపోయాడనే టాక్ ఉంది. అమ్మయిలతో నవదీప్ వ్యవహార శైలి కూడా అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఆయన వేధింపుల కారణంగా నటి అంకిత ఆత్మహత్యా యత్నం చేసిందనే ప్రచారం జరిగింది. టాలీవుడ్ లో ప్రకంపనలు లేపిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది.  


‘లవ్ మౌళి’ కారణంగానే అవకాశాలు వదులుకున్నా- నవదీప్


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవదీప్ తనకు రీసెంట్ గా పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశాడు. నిజానికి తనకు అవకాశాలు రావడం లేదు అని చెప్పడం కంటే, తానే వదులుకున్నట్లు వివరించాడు. తన తాజా చిత్రం ‘లవ్ మౌళి’  కోసం తాను పెంచిన జుట్టు, గడ్డం కారణంగానే ఇతర సినిమాలను ఒప్పుకోలేదని చెప్పాడు. “2020 చివరల్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం జుట్టు, గడ్డం బాగా పెంచాను. వాస్తవానికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే జుట్టు, గడ్డం తీసేయాలి అనుకున్నాను. కానీ, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. కంప్లీట్ అయ్యాక, ప్యాచ్ వర్క్స్ కోసం అలాగే ఉంచుకున్నాడు. ఈ టైమ్ లో ఒకటి రెండు తమిళ సినిమాలు మాత్రమే చేశాను. తెలుగు నుంచి అవకాశాలు వచ్చినా, గడ్డం, జుట్టు కారణంగా చేయలేకపోయాను. ఆ సినిమాకు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగానే ఇతర సినిమాలను వదులుకున్నాను” అని నవదీప్ చెప్పుకొచ్చాడు. 


జూన్ 7న ‘లవ్ మౌళి’ విడుదల


చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా 'లవ్ మౌళి' సినిమా రాబోతోంది. పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.  భావన సాగి మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. అవ‌నీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 7న  విడుదల చేస్తున్నారు. నవదీప్ చివరి సారిగా ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఇందులో బిందు మాధవి ఫీమేల్ లీడ్ లో కనిపించింది. శ్రీ ప్రవీణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు.  


Read Also: నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా