Tamil Nadu Honor Killing:


పరువు హత్య 


తమిళనాడులో పరువు హత్య (Honor Killing) సంచలనం సృష్టించింది. తమ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారన్న కోపంతో యువ జంటను కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఈ కొత్త జంట పరువు హత్యకు బలి అయింది. నవంబర్ 2వ తేదీన ఉదయం 6 గంటలకు ఉన్నట్టుండి ఓ ఆరుగురు వ్యక్తులు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడే నరికి చంపేశారు. మారి సెల్వం, కార్తిక దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇంట్లో వాళ్లకి చెప్పారు. కానీ అందుకు రెండు కుటుంబాల వాళ్లు ఒప్పుకోలేదు. అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 31 న ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటి నుంచి మరుగేశన్ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. అప్పటికే వీళ్ల గురించి కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఇంటి అడ్రెస్ కనుక్కున్నారు. నేరుగా ఇంటికి వెళ్లి హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు (Tamil Nadu Crime News) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మృతదేహాలనూ స్వాధీనం చేసుకున్నారు. తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం జరిపించారు. ఈ హత్యలో మొత్తం ఆరుగురి హస్తం ఉందని ప్రాథమికంగా నిర్ధరించారు. వీళ్లు రెండు బైక్‌లపై ఇంటికి వచ్చినట్టు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్‌ని ఏర్పాటు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోంది.