గంజాయి రవాణా తెలంగాణా పోలీసులకు చుక్కలు చూపిస్తోంది.. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి రవాణాకు చెక్‌ పెడుతున్న, పోలీసుల నిఘా కళ్లుగప్పి గుప్పుగుప్పున గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీల్లో, లేదా అందుతున్న పక్కా సమాచారంతో గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా రకారకాల పద్ధతుల్లో గంజాయిని నగరం నుంచి దాటించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్ అన్నట్టు సాగిపోతోందీ దందా. 


గంజాయి.. ఇప్పుడు చాలా మందికి ఓ మెయిన్‌ బిజినెస్‌గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రా సరిహద్దుల్లో ఈ గంజాయిని విచ్చలవిడిగా పండిస్తున్నారు. పంట ఆంధ్రప్రదేశ్‌లో పండుతుంటే, ఆ గంజాయికి ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో ఆ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి గంజాయి తీసుకువెళ్లాలంటే హైదరాబాద్‌ మీదుగా రవాణా చేయాల్సి ఉంటుంది. గంజాయి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు కళ్లుగప్పి ఎలాగో అలాగా నగరం వరకు చేరుకుంటున్నారు. కానీ, హైదరాబాద్‌ శివార్లలో మాత్రం పోలీసుల నిఘా కళ్లు గప్పి దాటించలేకపోతున్నారు.


అవుటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో వాహనాల నుంచి గంజాయిని మరో వాహనంలోకి మారుస్తూ కొంత మంది స్మగ్లర్లు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కుతుంటే... మరి కొంత మంది దొంగచాటున వాహనాల్లో రకారకాల పద్ధతుల్లో తరలిస్తూ దొరికిపోతున్నారు. గంజాయికి మహారాష్ట్రలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులో పండిస్తున్న గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నాయి ముఠాలు. లారీలు, కార్లు, బస్సులు ఇలా రకరకాల మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రా సరిహద్దుల నుంచి గంజాయి తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన సమాచారంతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్‌ఓటీలు ఈ గంజాయి రవాణా పై నిఘా ఉంచారు. పలుమార్లు గంజాయి తరలిస్తూ ముఠాలు పట్టుబడ్డాయి. దీంతో గంజాయి రవాణా ముఠాలు కొత్త కొత్త పంథాల్లో పోలీసుల కంట పడకుండా గంజాయిని తరలిస్తున్నాయి. అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఫ్యామీలితో వెళ్తున్నట్లుగా నటిస్తూ గంజాయిని తరలిస్తూ కూడా కొన్ని గ్యాంగ్‌లు చిక్కాయి.  దీంతో స్మగ్లర్లు అమ్మాయిలు ఉన్న పట్టుకుంటున్నారని భావించి, మరో దారిని వెతుకున్నారు. 


మొన్నీ మధ్య ఓ అంతర్‌ రాష్ట్ర ముఠా చిక్కింది. కొబ్బరి బోండాల మాటున గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు.  తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన పెంటారావు అలియాస్‌ బాపూజీ గంజాయిని సాగు చేస్తున్న వారిలో కీలకమైన నిందితుడు. ఇతను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వారికి గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఇతని దగ్గరికి వచ్చే వారిని ఏజెన్సీ ఏరియాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ కావాల్సినంత గంజాయిని అమ్ముతున్నాడు. ఇలా మధ్యప్రదేశ్‌కు చెందిన గంజాయి పెడ్లర్‌ నరేంద్ర, రెండు కోట్లకుపైగా విలువైన 13 వందల కిలోల గంజాయిని తీసుకెళ్లాడానికి మారేడుమిల్లి వచ్చాడు. డీసీఎంను తన వెంట తీసుకొని వచ్చిన నరేంద్రకు అడిగినంత గంజాయిని కిలో మూడు వేల రూపాయల చొప్పున పెంటారావు అమ్మాడు. 


ఈ గంజాయిని మార్కెట్లో కిలో 20 వేల రూపాయలకుపైగా విక్రయిస్తారు. గంజాయిని డీఎసీఎం వాహనంలో తీసుకొని, అక్కడి నుంచి నరేంద్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన డీసీఎం డ్రైవర్‌ చంద్రేశ్‌తో కలిసి బయల్దేరాడు. ఏపీ నుంచి బయటపడి, తెలంగాణాలోకి వచ్చారు. హైదరాబాద్‌ దాటి వెళితే హ్యాపీగా మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని అనుకుంటున్నారు. హయత్‌నగర్‌ సమీపంలోని జేసీబీ చౌరస్తా వద్ద పోలీసుల వాహనం వీరి డీసీఎంని ఆపింది. అంతే, వారిద్దరి ఆశలు అడిఆశలు అయ్యాయి. పోలీసులు ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని, వారి నుంచి 13 వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారాన్ని ఎస్‌ఓటీకి చేరింది. డీసీఎంలో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి, భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఎస్‌ఓటీ పట్టుకుంది. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన తొమ్మిది వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.


మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన యోగేశ్‌దత్త్‌ గైక్వాడ్‌ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఆంధ్రా, ఒడిషా రాష్ట్రాల సరిహద్దుల నుంచి మహారాష్ట్రలో విక్రయించేందుకు తన మిత్రులు బాబన్‌ సాల్వే, వినోద్‌ చంద్ర, తులసీరామ్‌ను సంప్రదించాడు. వీళ్లకు కమీషన్‌ ఆశ చూపించి గంజాయి తరలింపునకు ప్లాన్‌ వేశాడు యోగేశ్‌. మల్కన్‌గిరి జిల్లాకు చెందిన కర్రయ్య వద్ద కిలో మూడు వేల రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేశాడు. ఇలా ఇప్పటికే నాలుగుసార్లు హైదరాబాద్‌ మీదుగా గంజాయి మహారాష్ట్రకు తీసుకెళ్లాడు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో బాబన్‌సాల్వే, వినోద్‌, తులసీరామ్‌కు గంజాయి రవాణా అప్పగించారు. 


తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర లక్ష రూపాయలు పెట్టి కొబ్బరి బోండాలు నింపిన బస్తాలను కొనుగోలు చేశారు. కొబ్బరి బోండాల బస్తాల కింద గంజాయిని సర్ది మహారాష్ట్రకు తరలించాలని ప్లాన్‌ వేశారు. ఇందులో భాగంగా డీసీఎం వాహనంలో గంజాయి, కొబ్బరి బోండాలను సర్ది తీసుకెళ్తుండగా ఎస్‌ఓటీ పట్టుకుంది..


గంజాయిని ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న వారిని చాలా తక్కువ మందిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. కేవలం గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంతోనే స్మగ్లర్లు కొత్త కొత్త పంథాల్లో గంజాయిని ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు.. ప్రధాన నిందితులను కొంత మందిని గతంలోనే పట్టుకున్నామని, పీడి యాక్ట్‌ కూడా నమోదు చేశామని కమిషనర్‌ చెబుతున్నారు.. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఈ ఏడాది 160 మందిని పీడీ యాక్ట్‌ పై జైలుకు పంపించామని, వీరిలో అత్యధికులు గంజాయి స్మగ్లర్లు ఉన్నారని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరుతో వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ మార్కెట్లో రోజు రోజుకు గంజాయికి డిమాండ్‌ పెరుగుతుండటంతో అటు వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులతో సమన్యయ పరుచుకొని, గంజాయిని కట్టడి చేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐతే, గంజాయి కేవలం హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళ్తుందని చెబుతున్నారు.. మరి ఎప్పటిలోగా ఈ గంజాయి రవాణాకు చెక్‌ పడుతుందో వేచి చూడాలి.