Hyderabad News : దేశంలోని విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు ఎయిర్ పోర్టుల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు. బంగారం, డ్రగ్స్, మద్యం, కరెన్సీ ఇలా అన్నింటినీ అక్రమంగా రవాణా చేస్తున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నా.. రకరకాల పద్ధతులలో స్మగ్లింగ్ సాగిస్తున్నారు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అక్రమార్కులు బంగారం, డ్రగ్స్ ను దేశంలోకి తరలిస్తున్నారు.  శంషాబాద్‌ విమానాశ్రయంలో కూడా తరచూ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ట్రాలీ బ్యాగులోల ప్లాస్టిక్ షీట్ల కింద పెట్టి.. 
తాజాగా శంషాబాద్‌  ఎయిర్ పోర్టులో  పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు ఒక ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు.  అతడు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతని ప్రవర్తనపై అధికారులకు ముందే అనుమానం కలిగింది.  ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయగా కంగారులో తడబడుతూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతని ట్రాలీ బ్యాగ్ చెక్ చేయగా.. లోపల రూ. 67.11 లక్షలు విలువైన అమెరికన్ డాలర్లను అధికారులు గుర్తించారు. కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లోపల ప్లాస్టిక్ సపోర్ట్ షీట్ల కింద తెలివిగా దాచి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. రూ. 67.11 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.  ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  విదేశీ కరెన్సీ రవాణా వెనుక ఉన్న నెట్ వర్క్ ను గుర్తించేందుకు అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.






 భారీగా బంగారం పట్టివేత
నాలుగు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.  అబుదాబి నుంచి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద సుమారు 806 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. సదరు నిందితుడు బంగారాన్ని పౌడర్‌గా  చేసి దానిని ఉండలుగా మార్చి ప్రైవేట్ పార్ట్‌లో  పెట్టుకుని తీసుకుని వచ్చాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ  మార్కెట్లో దాదాపు 58.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. 


34కిలోల బంగారం, 40కిలోల వెండి స్వాధీనం
గత నెలలో శంషాబాద్‌ ఎయిర్ పోర్టు సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి పట్టుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.