Repalle Railway Station Gang Rape: గుంటూరు జిల్లా రేపల్లెలో గ్యాంగ్ రేప్ సంచలనం రేపింది. రేపల్లో రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు పనులు నిమిత్తం ఈ మహిళ కుటుంబం వెళ్తోంది. ఈ క్రమంలో గత రాత్రి రైలు దిగి రేపల్లె రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై పడుకున్నారు. నిద్రపోతున్న మహిళను ఫ్లాట్ ఫాం చివరకు లాక్కెళ్లిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలైన మహిళను ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నాలుగో ఘటన ఇది. బాపట్ల జిల్లాలో ఉన్న రేపల్లె రైల్వే స్టేషన్‌లో దుండగులు భర్తను కొట్టి వలస మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లుగా బాధితులు చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. కూలీ పనుల కోసం వచ్చిన భార్య భర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వే స్టేషన్‌లో రైలు దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోనే ప్లాట్ ఫాంపైన ఉన్న బెంచీలపైన పడుకున్నారు. 


ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. వారికి అడ్డుపడ్డ భర్తపై ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


రేపల్లెకు జిల్లా ఎస్పీ


అత్యాచార ఘటన నేపథ్యంలో బాపట్ల ఎస్పీ వకూల్‌ జిందాల్‌ రేపల్లె పీఎస్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను స్థానికులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు అనంతరం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.